- సెకెండ్ వేవ్ దెబ్బకు తగ్గిన లోన్ రీపేమెంట్స్
- క్యూ1లో పెరిగిన టాప్ బ్యాంకుల ఎన్పీఏలు
బిజినెస్డెస్క్, వెలుగు: బ్యాంకులకు మొండిబాకీల భయం పట్టుకుంది. ముఖ్యంగా రిటైల్ సెగ్మెంట్లోని లోన్లు ఎన్పీఏలుగా మారతాయని భయపడుతున్నాయి. కరోనా సెకెండ్ వేవ్ వలన ఏప్రిల్–జూన్ మధ్య బ్యాంకుల నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్పీఏ–మొండిబాకీలు) పెరిగాయని అంచనా. ఇప్పటికే జూన్ క్వార్టర్ రిజల్ట్స్ను ప్రకటించిన బ్యాంకుల ఎన్పీఏలు పెరగడాన్ని చూడొచ్చు. 2020–21 ఫైనాన్షియల్ ఇయర్లో కూడా బ్యాంకుల ఎన్పీఏలు పెరిగాయి. కానీ, ఎన్పీఏ అకౌంట్లుగా గుర్తించడంపై కొంత వెసులుబాటు ఇవ్వడంతో పాటు, లోన్ రీస్ట్రక్చరింగ్కు ఆర్బీఐ అనుమతి ఇవ్వడంతో ఫైనాన్షియల్ సంస్థల మొండిబాకీలు పెద్దగా పెరిగినట్టు కనిపించలేదు. కానీ, ఈ సారి ఆ పరిస్థితులు లేవు. చిన్న కంపెనీలు, కార్పొరేట్లకు ఇచ్చిన లోన్లు పెద్దగా ఎన్పీఏలుగా మారడంలేదని, కానీ, రిటైల్ సెగ్మెంట్లోని లోన్లు ఎక్కువగా ఎన్పీఏగా మారుతున్నాయని బ్యాంకింగ్ ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. కరోనా సెకెండ్ వేవ్ దెబ్బకు ఈ ఏడాది జూన్ క్వార్టర్లో రిటెయిలర్ల రీపేమెంట్ సామర్ధ్యం తగ్గింది. దీంతో పాటు తమ ఉద్యోగుల్లో కొంత మంది కరోనా బారిన పడ్డారని, లోన్లను సేకరించడంపై దీని ప్రభావం ఉందని ఓ ప్రైవేట్ బ్యాంక్కు చెందిన ఉద్యోగి అన్నారు. ప్రైవేట్ బ్యాంకులయిన యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు జూన్ క్వార్టర్కి గాను స్లిప్పేజ్లు పెరిగాయని ప్రకటించాయి. ముఖ్యంగా రిటెయిల్ సెగ్మెంట్లో ఇది ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొన్నాయి. స్లిప్పేజ్ అంటే లోన్ అకౌంట్ నాన్ పెర్ఫార్మింగ్ అకౌంట్(ఎన్పీఏ) గా మారడం.
అదే బాటలో ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు..
ఐసీఐసీఐ బ్యాంక్ రిటైల్ ఎన్పీఏలు (3.8 శాతం) ఈ ఏడాది జూన్ క్వార్టర్లో ఏడేళ్ల గరిష్టాన్ని తాకాయి. ముందుకెళ్లే కొద్దీ రిటైల్ లోన్ల బుక్ క్వాలిటీని బ్యాంకు మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డు సెగ్మెంట్లో ఐసీఐసీఐ బ్యాంక్ స్లిప్పేజ్లు ఎక్కువగా ఉన్నాయి. సెకెండ్ వేవ్ వలన లోన్ రీపేమెంట్ కలెక్షన్స్ తగ్గాయి. మేనేజ్మెంట్ కూడా ఆక్షన్ నోటిస్లను ఇవ్వడం తగ్గించింది. దీంతో బ్యాంక్కు చెందిన జువెల్ లోన్ (గోల్డ్ లోన్) పోర్టుఫోలియోలో కూడా స్లిప్పేజ్లు ఎక్కువగా ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మొండిబాకీలు కూడా జూన్ క్వార్టర్లో పెరిగాయి. ఇందులో కూడా చిన్న లోన్లే ఎక్కువగా ఎన్పీఏలుగా మారుతున్నాయి. మొండిబాకీలు పెరుగుతున్నప్పటికీ, సెప్టెంబర్ క్వార్టర్లో రీపేమెంట్ కలెక్షన్స్ పెరుగుతాయని దేశీయ బ్యాంకులు అంచనావేస్తున్నాయి. దీంతో బకాయిలు తొందరలోనే రికవరీ అవుతాయని ఆశిస్తున్నాయి.