- ముఠాపై దేశవ్యాప్తంగా 498 ఫిర్యాదులు
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఫెర్టిలైజర్ ఫ్రాంచైజీ పేరుతో దేశవ్యాప్తంగా సైబర్నేరాలకు పాల్పడుతూ రూ.కోట్లలో మోసం చేస్తున్న బిహారీ సైబర్ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఎస్పీ అఖిల్మహాజన్మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన అకునూరు గణేశ్ను నేరగాళ్లు నేషనల్ ఫెర్టిలైజర్స్ ఫ్రాంచైజీ ఇప్పిస్తామని ఫోన్, వాట్సాప్, ఈమెయిల్ ద్వారా సంప్రదించారు.
బాధితుడి నుంచి ఆధార్, పాన్ కార్డు, ఫొటో.. తదితర వివరాలను సేకరించి, రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో రూ.50వేలు వసూలు చేశారు. అనంతరం లైసెన్స్, ఫ్రాంచైజీ రిజిస్ట్రేషన్, అదనపు చార్జీల పేరుతో బాధితుడి నుంచి మొత్తం రూ.3,85,725 ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.
ఆ తర్వాత స్పందించకపోవడంతో మోసపోయామని గ్రహించి బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. సాంకేతిక ఆధారాలతో బిహార్ రాష్ట్రం నవాదా జిల్లాకు చెందిన అభిషేక్ కుమార్ అలియాస్ సౌరవ్, ఆశుతోశ్ కుమార్ అలియాస్ బబ్లూ, రితేశ్కుమార్, అభినాశ్కుమార్, నలందా జిల్లాకు చెందిన నిషుకుమార్ను నిందితులుగా గుర్తించారు.
అనంతరం బిహార్కు వెళ్లి అరెస్ట్ చేశారు. వీరిపై దేశవ్యాప్తంగా 498 సైబర్ నేరాల ఫిర్యాదులు ఉన్నాయని, ఇప్పటివరకు వీరు రూ.3.5 కోట్ల వరకు మోసం చేసినట్లు ఎస్పీ వివరించారు. నిందితుల నుంచి 10 సెల్ ఫోన్లు, రూ.70వేల నగదు, బ్యాంకు ఖాతాలు, స్టాక్ మార్కెట్ షేర్లలో ఉన్న రూ.8 లక్షలు జప్తు చేసినట్లు తెలిపారు. ఇవే కాకుండా నిందితులు బజాజ్ లోన్ పేరుతో సైతం మోసాలు చేసినట్లు పేర్కొన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.కార్యక్రమంలో డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, జైనథ్ సీఐ జి.శ్రావణ్, ఎస్సైలు పీర్ సింగ్, గౌతం, గోపీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
