
గోదావరిఖని, వెలుగు: రాష్ట్రంతోపాటు దక్షిణ భారతదేశంలో ఎరువుల కరువును తీర్చే రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 98% ఫ్యాక్టరీ పనులు పూర్తవగా.. మెషిన్ల ఏర్పాటు కూడా ఫైనల్ స్టేజ్కు చేరుకుంది. డిసెంబర్ నాటికి ఉత్పత్తిని ప్రారంభించేలా ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి చేసే ఎరువులను ‘కిసాన్ యూరియా’పేరుతో మార్కెట్ లోకి తేవాలని నిర్ణయించారు.
2015లో పనులు మొదలు
గతంలో రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీ(ఎఫ్సీఐ) నుంచి బొగ్గు ఆధారంగా యూరియా ఉత్పత్తి అయ్యేది. అప్పుల భారంతో నష్టాల్లో కూరుకుపోయి 1999లో మూతపడింది. 2004 తర్వాత పెద్దపల్లి ఎంపీగా వెంకటస్వామి (కాకా) ఫ్యాక్టరీ పురుద్ధరణకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఆ తర్వాత ఆయన కొడుకు వివేక్ వెంకటస్వామి చొరవతో ఫ్యాక్టరీ పునరుద్ధరణకు నాటి ప్రభుత్వం ఆమోదించింది. 2014లో ఎన్డీయే సర్కార్ వచ్చాక ఫ్యాక్టరీ స్థానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో గ్యాస్ ఆధారిత ఎరువుల ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2015 ఫిబ్రవరి 17న ఆర్ఎఫ్సీఎల్ ఏర్పడగా, 2016 ఆగస్టు 7న ప్రధాని మోడీ ఈ ప్లాంట్కు మెదక్ జిల్లా గజ్వేల్లో శంకుస్థాపన చేశారు. గత ఏడాది డిసెంబర్ నాటికే పనులు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలనుకున్నా వర్షాలు, ఇతర కారణాల వల్ల ఆలస్యమైంది.
రూ.5,920 కోట్ల ఇన్వెస్ట్మెంట్
ఫ్యాక్టరీ కోసం 560 ఎకరాల స్థలాన్ని కేటాయించగా సగం స్థలంలోనే ప్రధాన ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రూ.5,920.55 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ప్లాంటు పనులు మొదలుపెట్టింది. ఇందులో రూ.3,830 కోట్లను మెషిన్లకే ఖర్చు చేసింది. ఇప్పటి వరకు 98 శాతం పనులు పూర్తయ్యాయి. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసి ఎరువులు ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. రోజుకు 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియాను ఈ ప్లాంట్లో ఉత్పత్తి చేయనున్నారు. పూర్తిగా ఆటోమెటిక్ విధానం ద్వారా ఉత్పత్తి జరగనుంది. మొత్తం 440 మంది పనిచేయనున్నారు. వీరిలో 101 మంది అధికారులు, 283 మంది టెక్నీషియన్లు విధులు నిర్వహించనున్నారు. ఏటా సగటున 12.7 లక్షల టన్నుల ఎరువుల ఉత్పత్తి జరగనుండగా, దక్షిణాది రాష్ట్రాలకు వీటిని సరఫరా చేయనున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అధిక వాటా కేటాయించిన తర్వాతే మిగతా రాష్ట్రాలకు ఎరువులు అందించనున్నారు. రోజూ 500 లారీలు నడిచేందుకు వీలుగా ప్లాంట్ నుంచి గౌతమీనగర్ వరకు ప్రత్యేక రోడ్డు, వ్యాగన్లు నడిచేందుకు మూడో రైల్వే లైన్ నిర్మించారు.
మెషిన్ల ఏర్పాటు దాదాపు పూర్తి
ఫారిన్ టెక్నాలజీ సహకారంతో రూపుదిద్దుకుంటున్న ఆర్ఎఫ్సీఎల్లో మెషిన్ల ఏర్పాటు దాదాపు పూర్తయింది. అమ్మోనియా ప్లాంట్ టెక్నాలజీని డెన్మార్క్కు చెందిన హల్దర్ టాప్స్ కంపెనీ, యూరియా ప్లాంట్ టెక్నాలజీని ఇటలీకి చెందిన సైఫమ్ సంస్థ సమకూర్చాయి. రూ.3,830 కోట్లతో 373 రకాల మెషిన్లను తెప్పించారు. గంటకు 24 వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల కూలింగ్ వాటర్ సిస్టం, కంప్రెస్ ఎయిర్ సిస్టమ్, రా వాటర్, గ్యాస్ సిస్టం పనులు ఇప్పటి వరకు పూర్తయ్యాయి. యూరియా తయారీలో కీలకమైన ఫ్రిల్లింగ్ టవర్ను 134 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేశారు. వృథా గ్యాస్ను మండించేందుకు 60 మీటర్ల ఎత్తులో ఫ్లేర్ స్ర్టీక్ను నిర్మించారు. ఎరువుల ఉత్పత్తికి అవసరమయ్యే 32.5 మెగావాట్ల క్యాప్టివ్ పవర్ ప్లాంట్ను బీహెచ్ఈఎల్ సంస్థ రూ.233 కోట్లతో నిర్మించింది. ట్రాన్స్కో నుంచి 5 మెగావాట్ల విద్యుత్ను తీసుకోనుండగా, ఇందుకు సంబంధించిన స్విచ్యార్డులు, సబ్ స్టేషన్ల నిర్మాణం కూడా పూర్తయ్యింది.
నాడు స్వస్తిక్.. నేడు కిసాన్
బొగ్గు కర్మాగారంలో ఉత్పత్తి చేసిన ఎరువులను ‘స్వస్తిక్ యూరియా’ పేరుతో మార్కెట్ చేయగా.. ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్లో ఉత్పత్తయ్యే ఎరువులను ‘కిసాన్ యూరియా’పేరుతో మార్కెట్లోకి తేవాలని నిర్ణయించారు. మార్కెటింగ్ బాధ్యతలను నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ చేపట్టనున్నది.
వాటాదారులు వీళ్లే
ఆర్ఎఫ్సీఎల్ కంపెనీలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటాదారుగా ఉంది. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్కు 26 శాతం, ఇంజినీర్స్ ఇండియా లిమిడెట్కు 26 శాతం, ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు 11 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 11 శాతం, డెన్మార్క్కు చెందిన హల్దార్ టాప్స్ కంపెనీకి 11.7 శాతం, గ్యాస్ సరఫరా చేసే గెయిల్ సంస్థకు 14.3 శాతం వాటాలు న్నాయి. ఆరు బ్యాంకులు లోన్లు ఇస్తే.. వీటన్నిటికీ ఎస్బీఐ నోడల్ ఏజన్సీగా ఉంది
363 కిలోమీటర్ల నుంచి గ్యాస్.. ఎల్లంపల్లి నుంచి నీళ్లు
ఫ్యాక్టరీకి రోజు 2.2 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ గ్యాస్ వినియోగించనున్నారు. 363.65 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేజీ బేసిన్లోని తూర్పుగోదావరి జిల్లా మల్లవరం నుంచి గ్యాస్ సరఫరా కానుంది. ఇందుకోసం కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల పరిధిలో 15 చోట్ల కంట్రోల్ రూమ్లు నిర్మించారు. మంథని సమీపంలోని గుమ్మునూర్ వద్ద గల పాయింట్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలోని ఆర్ఎఫ్సీఎల్కు గ్యాస్ సరఫరా అవుతుంది. ఈ నెలాఖరుకు గ్యాస్ సరఫరాకు సంబంధించి అన్ని పనులు పూర్తవుతాయి. మరోవైపు ఆర్ఎఫ్సీఎల్కు అవసరమైన 0.55 టీఎంసీల నీటిని ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి కేటాయించింది. రోజూ 40.8 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేయనున్నారు. ఇందు కోసం 27 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నిర్మించారు.