
మంచిర్యాల: 10వ తరగతి పాసై ఇంటర్, డిగ్రీ, బీటెక్లు చదువుకోలేని విద్యార్థులకు ఏటీసీ సెంటర్ ద్వారా తక్కువ కాలంలోనే ఉద్యోగాలు వస్తాయని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థుల స్కిల్స్ వెలికితీసేందుకే ఏటీసీ సెంటర్లు ఎంతో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. మందమర్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏటీసీ సెంటర్ను ఎంపీ వంశీ సోమవారం (మే 5) సందర్శించారు. ఆ తర్వాత మంచిర్యాల కలెక్టరేట్లో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ శిక్షణ(TASK)కేంద్రాన్ని పరిశీలించారు.
ఏటీసీ సెంటర్లో ఏర్పాటు చేసిన ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ పరికరాలను పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, టాటా గ్రూప్ సౌజన్యంతో జిల్లా వ్యాప్తంగా నాలుగు ఏటీసీ సెంటర్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నాలుగు ఏటీసీ సెంటర్ల ద్వారా సంవత్సరానికి 1000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
►ALSO READ | మీరు తెలంగాణ అందాలు చూడండి: మే 15న పోచంపల్లికి మిస్ వరల్డ్-2025 పోటీదారులు
విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో విద్యను అభ్యసించినప్పుడే తమ లక్ష్యాన్ని సాధించవచ్చని సూచించారు. కష్టపడితేనే ఫలితం ఉంటుందని.. షాట్ టర్మ్ కోర్స్లు తీసుకుంటే గోల్ రీచ్ కాలేరని అన్నారు. కాగా, టాటా గ్రూప్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో ఆరు బ్రాంచీలలో విద్యను అభ్యసిస్తున్నారు. ఏటీసీ సెంటర్లో రెండు ఏండ్ల పాటు విద్యను అభ్యసించిన విద్యార్థులకు ఉపాధి కల్పించనున్న టాటా టెక్నాలజీ ఇండస్ట్రీస్.