రాజ్ కోట్ : క్రికెట్ అంటే ప్రపంచ వ్యాప్తంగా యమ క్రేజ్ అనే విషయం అందరికీ తెలిసిందే. అందులోనూ ఫైనల్ మ్యాచ్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. టికెట్స్ బుకింగ్ కోసం ముందే జాగ్రత్త పడుతారు. స్టేడియం మొత్తం అభిమానులతో కిక్కిరిసి పోతుంది. కానీ.. కరోనా దెబ్బకు బహుశా ప్రపంచంలోనే ఫస్ట్ టైం కావచ్చు.. ప్రజలు లేకుండానే ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర-బెంగాల్ టీమ్స్ తో జరుగుతున్న మ్యాచ్ శుక్రవారం తాడోపేడో తేలనుంది.
చివరి రోజు మ్యాచ్ కావడంతో ఫలితం ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. సౌరాష్ట్ర తొలి రంజీ టైటిల్ ను సాధించాలనే ఆశపడుతుంటే, మూడు దశాబ్దాల తర్వాత బెంగాల్ మొదటి టైటిల్ కోసం ఉవ్విళ్లూరుతోంది. ఇంతటి థ్రిల్లింగ్ ఫైనల్ మ్యాచ్ ప్రేక్షకులు లేకుండానే జరుగనుంది. కరోనాను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అలర్టైన విషయం తెలిసిందే.
దీంతో ఏ మ్యాచ్ నైనా ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ తో పాటు BCCIకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పట్నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకూ మ్యాచ్ లు జరిగే వేదికల్లో ప్రజల్ని అనుమతించరాదనే రూల్ విధించింది. దీంతో శుక్రవారం రంజీ ఫైనల్ చివరి ఆట ప్రేక్షకులు లేకుండానే జరగనుందన్నమాట.