పాత పెన్షన్ విధానాన్ని పునఃప్రారంభించాలని కొన్ని రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయంపై ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. పాత పెన్షన్ విధానం కాకుండా కొత్త విధానమే కోనసాగించాలని సూచించారు. పాత పెన్షన్ విధానం వలన భవిష్యత్తులో దేశంపై తీవ్ర అర్థిక భారం పడుతుందని రాజన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలు దీనిపై పునరాలోచించాలని పేర్కొన్నారు. పాత పెన్షన్ విధానం టెక్నికల్ గానూ, న్యాయపరంగానూ సాధ్యం కాదని చెప్పారు. కాబట్టి తక్కువ భారం కలిగే ఇతర మార్గాలను అన్వేషించాలని రాష్ట్రాలకు సూచించారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ లలో పాత పెన్షన్ విధానం అమల్లో ఉంది. పంజాబ్ సైతం పాత పెన్షన్ విధానానికి వెళుతున్నట్లు పేర్కొంది. పాత పెన్షన్ విధానం ప్రకారం పదవీ విరమణ నాటికి ఉన్న వేతనంలో 50 శాతం మొత్తాన్ని పెన్షన్గా ఇస్తారు. 2003లో నాటి ఎన్డీయే ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కొత్త పింఛను విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఉద్యోగి తన మూల వేతనంలో 10 శాతం మొత్తాన్ని పెన్షన్ నిధికి జమ చేయాలి.ప్రభుత్వం 14 శాతం జమ చేస్తుంది.