- అగ్నిప్రమాదంలో కాలి బూడిదైన వస్తువులు
- రూ.9.5 లక్షల ఆస్తి నష్టం
పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని మల్లెమోనిగూడ గ్రామంలో వరుసగా మూడు ఇండ్లలో అగ్ని ప్రమాదం జరిగింది. మల్లెమోనిగూడ గ్రామానికి చెందిన రసూల్ బీ, బషీర్ బీ, ఎండీ.మౌలానాకు చెందిన ఇండ్లు పక్కపక్కన ఉన్నాయి. బుధవారం ఇంట్లోని వ్యక్తులంతా పొలం పనులకు వెళ్లారు. ఈ సమయంలో మూడు ఇండ్లలో మంటలు చెలరేగి వస్తువులు దగ్ధమయ్యాయి. మంటలు వ్యాపించడం గమనించిన గ్రామస్తులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
వారు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అప్పటికే మూడు ఇండ్లలో రెండు మేకలు, 9 బియ్యం బస్తాలు, కూలర్, వాషింగ్ మెషీన్, ఇంటి డాక్యుమెంట్లు, సీలింగ్ ఫ్యాన్లు, దుస్తులు, నిత్యాసర వస్తువులు కాలి బూడిదయ్యాయి. సుమారు 9.5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు.
