టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 7 మంది మృతి చెందిన ఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 24 పరగణాల జిల్లాలోని బరాసత్లోని ఓ టపాసుల ఫ్యాక్టరీలో ఆగస్టు 27 తెల్లవారుజామున పేలుడు జరిగింది.
ఆ టైంలో అక్కడే ఉన్న 7 మంది ప్రమాదం ధాటికి అక్కడికక్కడే మృతి చెందారు. స్టేట్ యూనివర్శిటీకి 3 కిలోమీటర్ల దూరంలో పేలుడు జరగ్గా ఐదుగురు గాయపడ్డారు.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పేలుడు ధాటికి చుట్టు పక్కల బిల్డింగ్లు సైతం బీటలువారాయి.
మృతదేహాలు చెల్లచెదురుగా పడిపోవడంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. క్షతగాత్రులను బరాసత్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. శిథిలాల మధ్య చిక్కుకున్న పలువురిని స్థానికులు కాపాడారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.