
- ఇండియా నుంచి నేపాల్కు తొలి టూరిస్ట్ రైలు
- ప్రారంభించిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ, వెలుగు: ఇండియా– నేపాల్ మధ్య తొలి టూరిస్ట్ రైలు(రామాయణ సర్క్యూట్ రైలు) ప్రారంభమైంది. మంగళవారం ఢిల్లీలోని సఫ్దార్జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ట్రైన్ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్వినీ వైష్ణవ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడారు. రామాయణ యాత్ర రైలు శ్రీరాముడు నడిచిన అన్ని ప్రాంతాల గుండా ప్రయాణిస్తుందన్నారు. ఈ రైలు ఢిల్లీ నుంచి అయోధ్య, నేపాల్, రామేశ్వరం వరకు అనేక రాష్ట్రాలు తిరిగి చివర్లో తెలంగాణకు వెళ్తుందని చెప్పారు. 18 రోజుల యాత్రలో నేపాల్ లోని పుణ్యక్షేత్రమైన జనక్పూర్ను కవర్ చేస్తుందని చెప్పారు. అయోధ్య, నందిగ్రామ్, సీతామర్హుయి, వారణాసి, ప్రయాగ్రాజ్, చిత్రకూట్, పంచవతి, హంపి, రామేశ్వరం వంటి క్షేత్రాలకు వెళ్తుందని చెప్పారు. దక్షిణ అయోధ్య భద్రాచలం పర్యటనతో యాత్ర ముగిసి తిరిగి ఢిల్లీకి చేరుకుంటుందని వివరించారు. ఇందులో యాత్రికులకు భోజన, వసతి, స్థానిక రవాణా సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. థర్డ్ ఏసీ విభాగంలో ఒక్కో ప్రయాణికుడికి రూ. 65 వేలు ఖర్చవుతుందన్నారు. ఇదే తరహాలో వివిధ సర్క్యూట్ రైళ్లను నడపాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. బుద్ధిస్ట్ సర్క్యూట్ రైలు మార్గం తాను మంత్రి కాకముందు ఖరారైందని, తెలుగు రాష్ట్రాల్లోని బౌద్ధ క్షేత్రాలను కూడా ఇందులో కలపాలన్న ప్రతిపాదన ఉందని అన్నారు. త్వరలో దానిపైనా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.