1948 ఏప్రిల్​ 6న తొలి పారిశ్రామిక తీర్మానం

1948 ఏప్రిల్​ 6న తొలి పారిశ్రామిక తీర్మానం

ఆనాటి పరిశ్రమల మంత్రి శ్యాంప్రసాద్​ ముఖర్జీ 1948 ఏప్రిల్​ 6న తొలి పారిశ్రామిక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను రూపొందించాలని, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతో పారిశ్రామిక ప్రగతి జరగాలని ఆశించింది. ఇందులో పరిశ్రమలను నాలుగు రకాలుగా వర్గీకరించారు. 

ప్రభుత్వ ఏకస్వామ్యాలు: దేశ రక్షణ, తత్సంబంధ పరిశ్రమలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. ఉదా: ఆయుధాలు – ఆయుధ సామగ్రి, అణుశక్తి, రైల్వేలు

మిశ్రమరంగంలోని పరిశ్రమలు: టెలిఫోన్​, టెలీగ్రాఫ్​ – వైర్​లెస్​, ఇనుము ఉక్కు, బొగ్గు, విమానాల ఉత్పత్తి, నౌకా నిర్మాణం, మినరల్​ ఆయిల్స్​. వీటిని 10 సంవత్సరాల వరకు ప్రైవేట్​ వ్యక్తులే నిర్వహిస్తారు. 10 సంవత్సరాల తర్వాత జాతీయం చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. వీటిలో కొత్త పరిశ్రమలను ప్రభుత్వమే స్థాపిస్తుంది. 

ప్రభుత్వరంగ అజమాయిషీలోని పరిశ్రమలు: భారీ రసాయనాలు, భారీ యంత్రాలు, యంత్ర పరికరాలు, ఎరువులు, పంచదార, సిమెంట్​, కాగితం, ఆటోమొబైల్స్​ మొదలైన 18 పరిశ్రమల్లో ప్రైవేటు రంగాన్ని అనుమతించినా ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది. 

ఇతర పరిశ్రమలు: పై మూడు వర్గీకరణల్లో లేనివి దీనికిందికి వస్తాయి. ఇవి ప్రైవేట్​ రంగంలో ఉంటాయి. ఈ తీర్మానం చిన్న పరిశ్రమల అవశ్యకతను , విదేశీ మూలధనం అవశ్యకతను, కార్మికులు, యాజమాన్యం మధ్య సంబంధాలను గుర్తించింది. 

సమీక్ష: ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసింది. విదేశీ మూలధన ప్రాధాన్యతను గుర్తించింది. అయితే, 10 సంవత్సరాల తర్వాత జాతీయం చేయవచ్చు అనే వ్యాఖ్య వల్ల ఆ పరిశ్రమలపై శ్రద్ధ చూపలేదు.