చెన్నై మెట్రోపాలిటన్లోని అవడి మున్సిపాలిటీలో ఓ మహిళ తొలిసారి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించనున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అంబత్తూరు స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో సుజిత(34) అనే మహిళ సబ్ ఇన్స్పెక్టర్గా పని చేశారు. ఈ క్రమంలో అవడి పోలీస్ కమిషనర్ ఏ అరుణ్ ఆమెకు కొత్త బాధ్యతలు అప్పగించారు. అదే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించడం. తనకు అప్పగించిన ఈ బాధ్యతల గురించి సుజిత మాట్లాడుతూ..
రహదారి మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయడం తన ప్రాధాన్యత క్రమంలో ఉన్న కొన్ని అంశాలని ఆమె చెప్పారు. రోడ్లపై ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం, హెల్మెట్ల ప్రాధాన్యత ను ప్రజలకు వివరించడం, సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం తదితర సవాళ్లు తనకు ఎదురు కాబోతున్నట్లు తెలిపారు. జంక్షన్లలో నిలబడ్డప్పుడు ఎదురయ్యే కాలుష్యం, దుమ్ము తదితర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. చెన్నై తిరువళ్లూరు రోడ్డు అత్యంత సవాలుతో కూడుకున్నదన్నారు.