
కొన్ని రూట్లలో పెరిగిన డిమాండ్
గత 6 క్వార్టర్లలో టికెట్ ధరలు 40 శాతం అప్
రోజుకి 4.5 లక్షల మందికి పెరిగిన విమాన ప్రయాణికులు
న్యూఢిల్లీ: దేశంలో విమాన టికెట్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఎయిర్ ట్రాఫిక్, డిమాండ్ పెరగడంతో కొన్ని రూట్లలో టికెట్ ధరలు గత ఆరు క్వార్టర్లలో 40 శాతం ఎగిశాయి. అయినప్పటికీ గ్లోబల్గా చూస్తే ఇండియాలో విమాన టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. దేశ సివిల్ ఏవియేషన్ సెక్టార్ వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం రోజుకి 4.5 లక్షల మంది ప్యాసింజర్లు డొమెస్టిక్ ఫ్లయిట్లలో ప్రయాణిస్తున్నారు.
కానీ, మొత్తం జనాభాతో పోలిస్తే విమాన ప్రయాణాలు చేసే వారి వాటా చాలా తక్కువగా ఉంది. సప్లయ్ చెయిన్ సమస్యల కారణంగా చాలా కంపెనీల విమానాలు ఎగరడం లేదు. ‘దేశంలోని టాప్ 20 విమాన రూట్లలో టికెట్ రేట్లు ఇరవై ఏళ్లుగా మారనప్పటికీ, గత ఆరు క్వార్టర్లలో 40 శాత పెరిగాయి’ అని ఏవియేషన్ కన్సల్టెన్సీ కంపెనీ కాపా ఇండియా పేర్కొంది. ముంబై–ఢిల్లీ, బెంగళూరు–ఢిల్లీ, బెంగళూరు–ముంబై, ఢిల్లీ–హైదరాబాద్ రూట్లలో టికెట్ ధరలు భారీగా పెరిగాయని తెలిపింది.
సప్లయ్ సమస్య కారణంగా సుమారు 150 విమానాలు ఎగరడం లేదని, విమాన సర్వీస్లు తగ్గాయని కాపా ఇండియా వెల్లడించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో కూడా టికెట్ రేట్లు గరిష్టాల్లోనే కొనసాగుతాయని అంచనా వేసింది. గత మూడేళ్లు ముఖ్యంగా కరోనా సంక్షోభం తర్వాత విమాన టికెట్ రేట్లు భారీగా పెరిగాయని ఇంటర్గ్లోబల్ టెక్నాలజీ కోషంట్ సీఈఓ సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
అయినప్పటికీ సగటు టికెట్ ధర మిగిలిన దేశాలతో పోలిస్తే తక్కువగా ఉందని అన్నారు. ‘ఉదాహరణకు ఢిల్లీ–ముంబై మధ్య విమాన టికెట్ ధర సగటున రూ.5,000–6,000 ఉంది. కానీ, పర్సంటేజ్ ప్రకారం టికెట్ ధరలు భారీగా పెరిగినట్టు కనిపిస్తోంది. ఇన్ఫ్లేషన్ను పరిగణనలోకి తీసుకుంటే ఇది పెద్దగా పెరగలేదు’ అని అన్నారు. ఇండిగో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్గా పనిచేసిన సంజయ్ కుమార్, ఇన్ఫ్లేషన్కు తగ్గట్టు విమాన టికెట్ రేట్లు పెరగడం లేదని పేర్కొన్నారు.
ఇన్ఫ్లేషన్ను పరిగణనలోకి తీసుకొని, 2003–04 లో విమాన టికెట్ రేటు సగటున రూ.4,989 ఉంటే 2019–20 లో రూ.11 వేలకు పెరిగిందని కాపా ఇండియా పేర్కొంది. విమాన సర్వీస్లు సరిగ్గా లేకపోయినా 2000 వేల సంవత్సరం ప్రారంభంలో ఎయిర్లైన్ కంపెనీలకు నష్టాలు వచ్చేవి కావని, టికెట్ ధరలు ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమని వివరించింది. ఎయిర్ టికెట్ ధరలను డీరెగ్యులేట్ చేయడంతో సప్లయ్–డిమాండ్ బట్టి రేట్లలో ప్రస్తుతం మార్పు ఉంటోంది.
ఖర్చు తక్కువ..
ఏవియేషన్ ఎనలిటిక్స్ కంపెనీ సిరియం డేటా ప్రకారం, ప్రపంచలోనే విమాన టికెట్ రేట్లు తక్కువగా ఉన్న దేశాల్లో ఇండియా ముందుంది. ఇండియాలో 622 మైల్స్ దూరాన్ని ఒకవైపు ఎకానమీ క్లాస్లో ట్రావెల్ చేయడానికి సగటున 80 డాలర్లు అవుతోంది. అదే ఆస్ట్రేలియాలో 768 మైల్స్ దూరానికి 167 డాలర్లు, 709 మైల్స్కు బ్రెజిల్లో 114 డాలర్లు ఖర్చవుతోంది. యూఎస్లో అయితే 1,108 మైల్స్కు 180 డాలర్లు, 860 మైల్స్కు చైనాలో 126 డాలర్లు, యూరప్లో 813 మైల్స్కు 106 డాలర్లు, కెనడాలో 928 మైల్స్కు 173 డాలర్లు ఖర్చవుతోంది.
డెవలప్ అయిన దేశాలతో పోలిస్తే ఇండియాలో విమాన టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. ఇండియాతో పోలిస్తే ఖర్చు చేయగలిగే కెపాసిటీ వెస్ట్రన్ దేశాల్లో ఎక్కువని, అలానే ఇతర మార్కెట్లతో పోలిస్తే ఇండియాలో విమాన సర్వీస్లను ఆపరేట్ చేయడానికి కంపెనీలకు అయ్యే ఖర్చు తక్కువగా ఉందని వివరించారు.