- గో ఫస్ట్కు కేటాయించిన సీట్లను ఇతర ఎయిర్లైన్లకు డిస్ట్రిబ్యూట్ చేయని ప్రభుత్వం
- ఫుల్ డిమాండ్..పెరిగిన ఫ్యూయల్ రేట్లు
న్యూఢిల్లీ: గో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లయింగ్ రైట్స్పై దివాలా కోర్టు తాత్కాలికంగా నిషేధం విధించింది. దీంతో ప్రభుత్వం కూడా కంపెనీ ఫ్లయింగ్ రైట్స్ను ఇతర ఎయిర్లైన్ కంపెనీలకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు. దీంతో పాపులర్ రూట్లలో విమాన సర్వీస్లు తగ్గిపోతాయని, టికెట్ రేట్లు మరింత పెరుగుతాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఫెస్టివల్, వింటర్ సీజన్లో డిమాండ్ బాగుంటుందని, దీంతో రేట్లు భారీగా పెరుగుతాయని వెల్లడించాయి. ఇంటర్నేషనల్ ఫ్లయింగ్ రైట్స్ను ప్రభుత్వం కేటాయిస్తుంది. కేటాయించిన దానికంటే ఎక్కువ విమానాలను కంపెనీలు ఆపరేట్ చేయడానికి వీలుండదు. దివాలా తీయకముందు థాయ్ల్యాండ్, అబుదాబి, సింగపూర్, ఒమన్ వంటి ఇంటర్నేషనల్ డెస్టినేషన్లకు గో ఫస్ట్ సర్వీస్లు నడిపేది. థాయ్లాండ్కు వారానికి 8 వేల సీట్లు, మలేషియాకు 3 వేల సీట్లు, అబుదాబికి 9 వేల సీట్లు, సింగపూర్కు 1,200 సీట్లు కంపెనీ పొందిందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి.
‘ఇండియన్ ట్రావెలర్లకు ఇవి బాగా పాపులర్ డెస్టినేషన్లు. గో ఫస్ట్ రైట్స్ను ఇతర ఎయిర్లైన్ కంపెనీలకు కేటాయించడానికి ప్రభుత్వం ఇంకా ఒప్పుకోలేదు’ అని చెప్పాయి. లీజుకి ఇచ్చిన వారు గో ఫస్ట్ విమానాలను తిరిగి తీసుకోవడంపై, ఎయిర్లైన్ స్లాట్లను ఎయిర్ పోర్టులు క్యాన్సిల్ చేయడంపై, ప్రభుత్వం కంపెనీ ఫ్లయింగ్ రైట్స్ను ఇతర కంపెనీలకు కేటాయించడంపై దివాలా కోర్టు తాత్కాలిక నిషేధం విధించింది. రానున్న ఫెస్టివల్ సీజన్లో విమాన టికెట్ రేట్లు పెరుగుతాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు కూడా పెరిగాయని వెల్లడించారు. సెప్టెంబర్లో ఏటీఎఫ్ కిలో లీటర్ రేటు నెల ప్రాతిపదికన 14 శాతం ఎగసి రూ.1.12 లక్షలకు చేరుకుంది. అంతేకాకుండా అక్టోబర్, నవంబర్లో ఇండియాలో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ కూడా ఉంది. దీంతో డిమాండ్ ఫుల్గా ఉంటుందని ఎనలిస్టులు అన్నారు.