- కంపెనీ మొత్తం ఉద్యోగుల్లోఇది 5-7 శాతానికి సమానం
న్యూఢిల్లీ: సుమారు 1,500 మంది ఉద్యోగులను తొలగించే పనిలో ఫ్లిప్కార్ట్ ఉంది. వాల్మార్ట్కు చెందిన ఈ కంపెనీ ఇప్పటికే ఉద్యోగుల పెర్ఫార్మెన్స్ను రివ్యూ చేస్తోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి– ఏప్రిల్లోపు పెర్ఫార్మెన్స్ రివ్యూ పూర్తవుతుందని, ఉద్యోగుల్లో 5– 7 శాతం మందిని కంపెనీ ఇంటికి పంపించేయొచ్చని అన్నారు. ఫ్లిప్కార్ట్ ఉద్యోగుల సంఖ్య 22 వేలు. రిపోర్ట్స్ ప్రకారం, ఫ్లిప్కార్ట్ ఫ్యాషన్ పోర్టల్ మింత్రాలో పని చేస్తున్నవారిని ఇందులో కలపడం లేదు. ఫ్లిప్కార్ట్ చాలా కాలం నుంచి ఇంటర్నల్గా రీస్ట్రక్చర్ చేయాలని చూస్తోంది.
ప్రాఫిటబుల్ కంపెనీగా కొనసాగాలనుకుంటోంది. కంపెనీ ఇప్పటికే హైరింగ్ ఆపేసిందని, గత ఏడాది కాలంగా ఫ్రెషర్లను తీసుకోవడం నిలిపేసిందని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. ‘ ప్రతీ ఏడాది చేసే పనే ఇది. ఫ్లిప్కార్ట్ ఇంటర్నల్గా రీస్ట్రక్చర్ చేస్తోంది. కిందటేడాది ఫ్లిప్కార్ట్తో సహా చాలా ఈ–కామర్స్ కంపెనీలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి’ అని ఎనలిస్టులు పేర్కొన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్ సమావేశం కానుందని, రిసోర్స్లను సరిగ్గా వాడుకోవడంపై నిర్ణయం తీసుకోనున్నారని అన్నారు. కాగా, చాలా టెక్ కంపెనీలు 2021 తర్వాత నుంచి ఉద్యోగులను పెద్ద మొత్తంలో తీసేస్తున్నాయి. ఉదాహరణకు పేటీఎం ఇప్పటికే 1,000 మందిని తొలగించగా, మరో 10–15 శాతం మందిని తగ్గించుకోవాలనే చూస్తోంది.