ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తిన వరద.. రెండు రోజుల్లో 30 మంది మృతి..

ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తిన వరద.. రెండు రోజుల్లో 30 మంది మృతి..
  • ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు

ఇటానగర్/గువహటి: ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి మొత్తం 30 మంది చనిపోయారు. అరుణాచల్ ప్రదేశ్ లో 9 మంది మృతి చెందగా.. అస్సాంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మిజోరాం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ లో 16 మంది మృతి చెందారు. అరుణాచల్ ప్రదేశ్​లో చనిపోయిన వారిలో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు ఉన్నారు. వారంతా ఓ కారులో బిచోం జిల్లాలోని బానా నుంచి ఈస్ట్  కమెంగ్  జిల్లాలోని సెప్పాకు వెళుతుండగా శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఈస్ట్  కమెంగ్​లో రోడ్డు పక్కనున్న కొండచరియలు విరిగిపడడంతో కారు అదుపుతప్పి 150 మీటర్ల అడుగుల లోయలో పడిపోయింది.

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. అప్పటికే కారులో ఉన్న వారంతా చనిపోయారు. మరో ఘటనలో లోయర్ సుబన్ సిరి జిల్లాలో కార్మికులు పొలంలో పనిచేస్తుండగా.. కొండచరియలు విరిగిపడి ఇద్దరు కూలీలు చనిపోయారు. ఇక రాష్ట్రంలోని చాలాచోట్ల భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కరెంటు సరఫరా నిలిచిపోయింది. ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వెస్ట్  కమెంగ్ జిల్లాలోని జమిరి వద్ద చరాయ్  సమీపంలో వరదలకు రోడ్లు కోతకు గురవడంతో 35 మంది ఇరుక్కుపోయారు.

అస్సాంలో ఐదుగురు..

అస్సాంలోనూ భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో కురిసిన భారీ వానలకు ఆరు జిల్లాల్లో వరదలు సంభవించాయి. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. కామ్ రూప్  మెట్రోపాలిటన్  జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. గువహటితో పాటు పలు నగరాలు, పట్టణాల్లో రోడ్లు చెరువులను తలపించాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం కలిగింది. జనజీవనం స్తంభించిపోయింది. కరెంటు సరఫరా నిలిచిపోయింది. చిరాంగ్, బస్కా, బార్పేట, బోన్ గాయ్ గోన్, బాలాజి, తమల్ పూర్, దర్రాంగ్, ఉదల్ గురిలో రెడ్  అలర్ట్  ప్రకటించారు. ఇక మేఘాలయ, త్రిపుర,మిజోరాం, నాగాలాండ్ లోనూ భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 16 మంది చనిపోయారు.