
- నారాయణపూర్ నుంచి దిగువకు68,800 క్యూసెక్కులు విడుదల
- జూరాలలో పెరుగుతున్న నీటిమట్టం..37 వేల క్యూసెక్కులు దిగువకు
- తుంగభద్రలోనూ ప్రవాహం గోదావరి బేసిన్లో హై అలర్ట్..
- 4 లక్షల క్యూసెక్కులకు చేరిన వరద
హైదరాబాద్/జయశంకర్ భూపాలపల్లి/భద్రాచలం/గద్వాల, వెలుగు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదులకు వరద క్రమంగా పెరుగుతున్నది. కృష్ణా నదిపై కర్నాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి 65 వేల క్యూసెక్కుల వరద జూరాల వైపు వస్తుండగా, కాళేశ్వరం దిగువన 4 లక్షల క్యూసెక్కుల వరదతో గోదావరి ఉప్పొంగుతున్నది. ఇవాళ ఆరేడు లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందనే అంచనాతో గోదావరి బేసిన్లో ఆఫీసర్లు హై అలర్ట్ ప్రకటించారు.
కృష్ణా నదిపై ఓ 10 రోజుల పాటు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగే అవకాశాలున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆల్మట్టి నిండేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నా.. ఒకేసారి భారీ వరద వస్తే ఖాళీ ఉంచుకోవాలన్న ఉద్దేశంతో వరదను దిగువన ఉన్న నారాయణపూర్జలాశయానికి రిలీజ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్లో 129.72 టీఎంసీలకుగానూ 101.18 టీఎంసీల నిల్వ ఉన్నది. ఎగువ నుంచి 61 వేల క్యూసెక్కులకుపైగా వరద వస్తుండగా.. 65 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. శుక్రవారం ఉదయం 46 వేల క్యూసెక్కుల వరకు వరద ఆల్మట్టికి రాగా.. సాయంత్రానికి కొంచెం పెరిగింది. శనివారం ఉదయం అది 80 వేల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మరో వారం రోజుల్లో ఆల్మట్టి నిండే చాన్స్ ఉందని చెప్తున్నారు. నారాయణపూర్కు 62 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. దిగువకు 68,810 క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రస్తుతం ఈ డ్యామ్ దాదాపు నిండింది. 37.64 టీఎంసీల కెపాసిటీకిగానూ ప్రస్తుతం 34.74 టీఎంసీల జలాలున్నాయి. నారాయణపూర్ నుంచి కూడా నీటి విడుదల ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.
తుంగభద్రపై ఆశలు
నారాయణపూర్ నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో జూరాల ప్రాజెక్టుకు 65వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. ఈ ప్రాజెక్టు కూడా నిండేందుకు తక్కువ టైమే పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో 3,4 రోజుల్లో ప్రాజెక్ట్ నిండేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 9.66 టీఎంసీలకుగానూ 6.22 టీఎంసీల నిల్వ ఉండగా.. దిగువన శ్రీశైలానికి 37,905 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
ఇటు తుంగభద్ర కు వరద పెరుగుతున్నది. 1,07,632 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. తుంగభద్రలో వరద పెరుగుతుండడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై ఆశలు చిగురిస్తున్నాయి. తుంగభద్రలో 105.79 టీఎంసీల కెపాసిటీకిగానూ ప్రస్తుతం 59.8 టీఎంసీల నీళ్లున్నాయి. వరద ప్రవాహం మరో పది రోజులు కొనసాగే అవకాశం ఉందని, మరింత పెరిగితే ఇటు జూరాలతో పాటు అటు తుంగభద్ర నుంచి శ్రీశైలానికి వరద మరింత పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
కాగా, జూరాల నుంచి విడుదల చేస్తున్న జలాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు 32,673 క్యూసెక్కుల వరద వస్తున్నది. తాగునీటి కోసం విద్యుదుత్పత్తి ద్వారా శ్రీశైలం నుంచి 7,063 క్యూసెక్కులను విడుదల చేస్తుం డగా.. సాగర్ నుంచి 9,212 క్యూసెక్కుల నీటి ని వదులుతున్నారు. శ్రీశైలంలో 215.81 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 33.11 టీఎంసీల స్టోరేజీ ఉంది. సాగర్లో 312.05 టీఎంసీలకు, 123.34 టీఎంసీల నీళ్లున్నాయి.
గోదావరి తీరప్రాంతాలు అప్రమత్తం
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరుగుతున్నది. దీంతో ఆఫీసర్లు బ్యారేజీల గేట్లన్నీ తెరిచి ఉంచారు. ప్రభుత్వం ఏటూరునాగారంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాలల్లో 135 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎన్డీఆర్ఎఫ్ టీంతో పాటు నాలుగు బోట్లు అందుబాటులో ఉంచింది.
తక్షణ సహాయం కోసం ఏటూరునాగారం కంట్రోల్ రూమ్ మొబైల్ నం బర్ 6309842395, 08717-293246 కు కాల్ చేయాలని ములుగు కలెక్టర్ టీఎస్.దివాకర ప్రకటించారు. భద్రాచలం వద్ద గోదావరి డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. ఎగువన వాజేడు మండలం పేరూరు వద్ద 12.78 మీటర్ల నీటిమట్టం ఉన్నట్టు సీడబ్ల్యూసీ ఆఫీసర్లు తెలిపారు.
వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో కోల్ ప్రొడక్షన్ దెబ్బతిన్నది. 3 రోజులుగా కోల్ బెల్ట్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో దాదాపు 40 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. సింగరేణి వ్యాప్తంగా శుక్రవారం 1,74,347 టన్నులకు గానూ 1,21,835 టన్నుల బొగ్గును మాత్రమే ఉత్పత్తి చేశారు.
సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల
హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎడమ కాలువకు శుక్రవారం అధికారులు తాగునీటిని విడుదల చేశారు. కృష్ణానది రివర్ బోర్డ్ తెలంగాణకు 5.5 టీఎంసీలు కేటాయించిం ది. ఈ నీటి వాటాలో భాగంగా రోజుకు 10 వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 5.5 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నట్టు అధికా రులు తెలిపారు. నీటి పారుదలశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువులతోపాటు ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ నింపి, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఆఫీసర్లు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుత నీటిమట్టం 590 అడుగులు కాగా శుక్రవారం 505.10 అడుగుల (123.5012టీఎంసీల) నీటి నిల్వ ఉంది.
గోదావరికి హై అలర్ట్
కృష్ణా నదితో పోలిస్తే గోదావరి బేసిన్లో వరదలు ఎక్కువగా వస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద వేగంగా పెరుగుతున్నది. మేడిగడ్డ నుంచి 3,41,350 క్యూసెక్కుల వరదను కిందకు వదిలేస్తున్నారు. తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్ బ్యారేజీ నుంచి 3,75,430 క్యూసెక్కుల వరద దిగువకు వెళ్లిపోతున్నది. సీతమ్మసాగర్ ప్రాజెక్ట్ నుంచి 3,47,511 క్యూసెక్కుల వరద వెళ్తున్నది.
శుక్రవారం ఉదయం నాటికి 3 లక్షల క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం సాయంత్రం నాటికి 4 లక్షల క్యూసెక్కులకు చేరింది. అయితే, శనివారం గోదావరి బేసిన్ను అధికారులు హై అలర్ట్లో ఉంచినట్టు తెలిసింది. శనివారం ఉదయం నాటికి అక్కడ వరద ఆరేడు లక్షల క్యూసెక్కులను దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. శ్రీరాంసాగర్కు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కాగా, పెద్దవాగు కట్ట కొట్టుకుపోయిన ఘటనపై అక్కడి ఫీల్డ్అధికారులకు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులిచ్చినట్టు సమాచారం.