మేడారం జాతరలో కోళ్లను ఎందుకు ఎగురవేస్తారో తెలుసా....

మేడారం జాతరలో కోళ్లను ఎందుకు ఎగురవేస్తారో తెలుసా....

అడవి తల్లులను దర్శించుకుంటే చాలు.. అంతా మంచే జరుగుతుంది. అమ్మల చల్లని చూపు.. కొండంత బలం. ఇక్కడ ప్రకృతే దేవతలు. సమ్మక్క, సారలమ్మపై భక్తులకు ఎంతో విశ్వాసం. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన ఈ మేడారం గిరిజన జాతర.. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి జరుగుతుంది.  అయితే  మేడారంలో సమ్మక్క సారక్క జాతరలో మొక్కులు తీర్చుకునే భక్తులు గాల్లోకి కోళ్లను ఎగురవేయడం ఆనవాయితీ. ఎందుకో తెలుసుకోండి.

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా విరాజుల్లుతున్న మేడారం సమ్మక్క, సారలమ్మల జాతరలో (Sammakka Sarakka Jathara) అమ్మవారు గద్దెపైకి వచ్చే సందర్భంగా అక్కడ ఉన్న భక్తులు  కోళ్లను ఎగరేయడం ఆనాయితీగా వస్తున్న అంశం. ఉగ్రరూపంలో ఉండే అమ్మవారు గద్దమీదికి చేరుకునే ముందు ఇలా భక్తులు తమ మొక్కులను అమ్మవార్లకు చూపెడుతూ శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.ఈ క్రమంలో ఇలా కోళ్లను సైతం ఎగరవేయడం మొదలైందని పలువురు స్థానికులు  వివరించారు.  భక్తులు అమ్మవార్లకు వివిధ రకాల మొక్కులు మొక్కుతుంటారని తమ సంక్షేమం కోసం తమ కుటుంబ క్షేమం కోసం పక్కన మొక్కలను తీర్చుకునేందుకు ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతరకు తరలి వస్తుంటారని చెబుతున్నారు.

చిలకలగుట్ట నుంచి గద్దపైకి అమ్మవారు చేరుకునే సమయంలో ఉగ్రరూపంలో ఉంటారని, వారిని శాంతించేందుకు తమ మొక్కులను అమ్మవార్లకు ఎదురుచూపెడుతూ శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తుంటారని స్థానికులు అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది జరగబోయే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలను ఆలయ పూజారులు ప్రకటించిన విషయం తెలిసిందే.ఫిబ్రవరి నెలలో నాలుగు రోజులపాటు ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ములుగు జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.‌ ఈ నేపథ్యంలో ఈ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఉత్సవంగా నిర్వహించే ఈజాతర ఈఏడాది ఫిబ్రవరి 21 నుంచి మొదలై 24వ తేదీ వరకు జరనుంది.  2024 ఫిబ్రవరి 14న మాఘ శుద్ధ పంచమి (బుధవారం) రోజున మండ మెలగడం, గుడి శుద్ధీకరణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పూజారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 21న బుధవారం రోజు సాయంత్రం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెకు తీసుకువస్తారు. ఫిబ్రవరి 22న గురువారం రోజున సమ్మక్క దేవతను గద్దెకు తీసుకువస్తారు. ఫిబ్రవరి 23న శుక్రవారం రోజున శ్రీ సమ్మక్క సారాలమ్మ దేవతలకు, శ్రీ గోవిందరాజులు, శ్రీ పగిడిద్ద రాజులు దేవుళ్లకు భక్తులు మొక్కులు చెల్లిస్తారు.ఫిబ్రవరి 24న శనివారం రోజున శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతలు, శ్రీ గోవిందరాజులు, శ్రీ పగిడిద్ద రాజులు దేవుళ్లు వనప్రవేశం చేస్తారు.ఫిబ్రవరి28న బుధవారం తిరుగువారం పండుగ నిర్వహిస్తారు. దాంతో సమ్మక్క సారలమ్మ జాతర ముగిస్తుంది. తెలంగాణ కుంభమేళాగా భావించే మేడారం జాతరకు ఈ ఏడాది సుమారు కోటికిపైగా భక్తులు వచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు

కీలక ఘట్టాలివే…

మేడారం జాతరలో ముఖ్యమైన ఘట్టం.. పగిడిద్దరాజను తీసుకురావడం. పగిడిద్దరాజును గిరిజన సంస్కృతి, సంప్రదాయాలతో మేడారానికి తీసుకువస్తారు. జాతరలో పగిడిద్దరాజుది ప్రత్యేక స్థానం. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లలో జాతరకు ఒకరోజు ముందు పగిడిద్దరాజును పెళ్లికొడుకును చేస్తారు. ఆ తర్వాత మర్నాడు ఆలయానికి చేరుకొని, బలి, ప్రత్యేక పూజలు చేస్తారు. కొత్త దుస్తులతో పగిడిద్ద రాజును సిద్ధం చేసి మేడారానికి బయలుదేరుతారు. సాయంత్రానికి మేడారం చేరుకుంటారు. పగిడిద్దరాజును తీసుకొచ్చిన విషయాన్ని.. సమ్మక్క పూజారులకు కబురు పంపిస్తారు. అప్పటికే జాతర కోసం.. ఉదయం సమ్మక్క ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. కుండ రూపంలో ఉన్న సమ్మక్కను అలంకరిస్తారు. ఆ తర్వాత.. పగిడిద్ద రాజుకు ఆహ్వానం ఇస్తారు. వారిద్దరినీ ఎదురుదెరుగా కూర్చొబెట్టి.. వాయనం ఇచ్చిపుచ్చుకుని.. వివాహం పూర్తి చేస్తారు. పగిడిద్ద రాజును సారలమ్మ గద్దెల వద్దకు తీసుకుని పోతారు.

అదే రోజు సారలమ్మకు కన్నేపల్లిలో ఉదయమే రెండు మూడు గంటలపాటు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అక్కడ నుంచి మేడారం తీసుకువస్తారు. గద్దెల నుంచి ఈ ప్రాంతం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సారలమ్మ గద్దెకు చేరుకునే రోజే తండ్రి పగిడిద్దరాజు ప్రత్యక్షం అవుతాడు. సారలమ్మ భర్త గోవిందరాజును సైతం.. ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామం నుంచి తీసుకువస్తారు. గ్రామస్తులంతా గోవిందరాజును తీసుకుని ఊరేగింపుగా మేడారానికి వస్తారు. ఒకే రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులస్వామి గద్దెలపైకి చేరుకుంటారు.

ఆ తర్వాత చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను తీసుకుని వస్తారు. అధికార లాంఛనాలతో పోలీసుల తుపాకీ కాల్పుల గౌరవ వందనం, ఎదురుకోళ్ల ఘట్టంతో సమ్మక్కను ఆహ్వానిస్తారు. అయితే మేడారానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టపై నారచెట్టుకింద ఉన్న కుంకుమ భరిణె రూపంలోని సమ్మక్క ఉంటుంది. ఆమెను కుంకుమ భరిణే రూపంలో పూజారులు తీసుకొస్తారు. అనంతరం గద్దెపై ప్రతిష్టిస్తారు. మేడారం జాతర మెుత్తానికి ఇదే కీలక ఘట్టం. ఈ తంతు తర్వాత ఉత్సవ మూర్తులంతా గద్దెలపై కొలువై మూడో రోజు భక్తులకు దర్శనం ఇస్తారు. అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. జాతరలో చివరి రోజున దేవతలను మళ్లీ వనంలోకి పంపిస్తారు. దేవతలు.. వనప్రవేశం చేయడంతో.. మేడారం మహాజాతర పరిపూర్ణం అవుతుంది