
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ: మనదేశంలో గత 11 సంవత్సరాల్లో రిజిస్టర్డ్ స్టార్టప్ల సంఖ్య 1.76 లక్షలకు చేరిందని, వీటిలో 118 యునికార్న్లు (1 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన స్టార్టప్లు) ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆమె అన్నారు.
భారతదేశ యువత స్టార్టప్లను నిర్మిస్తూ ఉద్యోగాలను సృష్టిస్తోందని ఆమె ‘ఎక్స్’లో రాశారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో గత 11 సంవత్సరాల్లో యువత కోసం చేసిన కృషికి ఇది ఒక ఉదాహరణ అని ఆమె పోస్ట్ చేశారు. మనదేశంలో గత 11 సంవత్సరాల్లో ఏడు కొత్త ఐఐటీలు, ఎనిమిది కొత్త ఐఐఎంలు 16 కొత్త ఎయిమ్స్ ఆస్పత్రులు ప్రారంభమయ్యాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా ‘ఎక్స్’ పోస్ట్ద్వారా వెల్లడించారు.
"ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద 1.6 కోట్లకు పైగా యువతకు శిక్షణ ఇచ్చాం. 1.6 లక్షల స్టార్టప్ల ద్వారా 17.6 లక్షల డైరెక్ట్ జాబ్స్ వచ్చాయి. దాదాపు 30 వేల వొకేషనల్ స్కూల్స్ఏర్పాటు అయ్యాయి. వీటిలో 30 లక్షలకు పైగా విద్యార్థులు చేరారు’’ అని మంత్రి వివరించారు. గత 11 సంవత్సరాల్లో చిన్న వ్యాపారాలకు 52.5 కోట్లకు పైగా పూచీకత్తు లేని ముద్ర రుణాలు పంపిణీ అయ్యాయని, వీటి విలువ రూ. లక్ష కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు.
గత నెలలో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ స్టార్టప్ల కోసం క్రెడిట్ గ్యారెంటీ పథకం విస్తరణను ప్రకటించింది. ఇది ఒక్కో రుణగ్రహీతకు గ్యారెంటీ కవరేజీ పరిమితిని రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు పెంచింది.