- ఎఫ్ఎంసీజీ అమ్మకాలు స్లో.. గ్రామీణ మార్కెట్ కాస్త బెటర్
- వృద్ధి 5.4 శాతం డౌన్
- నీల్సన్ ఐక్యూ రిపోర్ట్ వెల్లడి
న్యూఢిల్లీ: జీఎస్టీ రేట్ల తగ్గింపు, ఇతర ఇబ్బందుల వల్ల సబ్బులు, బిస్కెట్లు, నూడుల్స్ వంటి ఫాస్ట్ మూవబుల్ కన్జూమర్ ప్రొడక్ట్స్(ఎఫ్ఎంసీజీ) రంగం అమ్మకాల వృద్ధి నెమ్మదించింది. డేటా అనలిటిక్స్ సంస్థ నీల్సన్ ఐక్యూ తాజా రిపోర్ట్ ప్రకారం, 2025 సెప్టెంబర్ క్వార్టర్లో ఎఫ్ఎంసీజీ అమ్మకాల పరిమాణం పరంగా వృద్ధి 5.4 శాతానికి తగ్గింది. విలువపరంగా వృద్ధి మాత్రం 12.9 శాతానికి పెరిగింది. గ్రామీణ మార్కెట్ వృద్ధి కూడా ఏడాది ప్రాతిపదికన 8.4 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గింది.
అయినప్పటికీ, ఇది వరుసగా ఏడో క్వార్టర్లోనూ పట్టణ ప్రాంతాల కంటే మెరుగైన అమ్మకాలను సాధించింది. ఈ క్వార్టర్లో మార్కెట్ సైజులో 5.4 శాతం పెరుగుదల నమోదు కాగా, ధరలు 7.1 శాతం పెరిగాయి. కస్టమర్లు చిన్న ప్యాక్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎఫ్ఎంసీజీ డిమాండ్లో మెజారిటీ వాటా ఉండే పట్టణ మార్కెట్, చిన్న పట్టణాల్లో మాత్రం కొంతవరకు కోలుకుంటోంది. సుమారు 38 శాతం ఎఫ్ఎంసీజీ డిమాండ్ ఉండే గ్రామీణ మార్కెట్కు చిన్న ప్యాకెట్లు కీలకం. గ్రామీణ భారతదేశం 7.7 శాతం వృద్ధిని నమోదు చేయగా, పట్టణ ప్రాంతాలు 3.7 శాతం వృద్ధిని సాధించాయి. పట్టణ ప్రాంతాలు మెల్లగా కోలుకుంటుండటంతో ఈ అంతరం తగ్గుతోంది.
ఈ–కామర్స్ హవా..
2025 మార్చి క్వార్టర్లో, సెప్టెంబర్ క్వార్టర్లో గ్రామీణ మార్కెట్ వరుసగా 8.3 శాతం, 8.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. మెట్రోపాలిటన్ ప్రాంతాలవాసులు ఈ-–కామర్స్ కంపెనీల వైపు మారడం వల్ల ఆఫ్లైన్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ‘‘పట్టణ మార్కెట్లలో రికవరీ వేగం పుంజుకుంటున్నప్పటికీ, అమ్మకాల పెరుగుదలకు గ్రామీణ డిమాండ్ కీలకం. ముఖ్యంగా టాప్ ఎనిమిది మెట్రోల్లో ఈ–-కామర్స్ ద్వారా అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుతుండటంతో ఇక నుంచి వినియోగం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి” అని నీల్సన్ఐక్యూ రిపోర్ట్ పేర్కొంది.
