దేశంలో ప్రతి ఐదుగురిలో ఒక్కరంటే ఒక్కరే రెగ్యులర్ కంటి చెకప్లకు వెళ్తున్నారట. పైగా కంటి రోగాలతో హాస్పిటళ్లలో చేరిన వాళ్లలో 84 శాతం మంది డాక్టర్ సలహాలను కచ్చితంగా పాటించట్లేదట. సిగ్నిఫై అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయాలన్నీ తెలిశాయి. దేశంలోని పెద్ద నగరాల్లో 300 మంది ఆప్తమాలజిస్టులు, వెయ్యి మంది పెద్దలను ఆ సంస్థ సర్వే చేసి ఈ విషయం వెల్లడించింది. సర్వే చేసిన వాళ్లలో 65 శాతం మంది కంటి చూపు బాగుంటేనే అన్ని పనులు చక్కగా చేసుకోగలమని చెప్పారని, చాలా కొద్ది మందే తమ కంటిచూపు విషయమై దృష్టి పెడుతున్నారని చెప్పింది. ఇండియన్లు 14 గంటల పాటు బయట, ఆఫీసు, ఇంట్లో ఆర్టిఫిషియల్ లైట్లో వస్తువులను చూస్తున్నారని, పనులు చేస్తున్నారని పేర్కొంది. ఈ కాంతే కంటిచూపును ప్రభావితం చేస్తుందని, వెలుతురు సరిగా లేనప్పుడు పని చేస్తే కంటిపై ఒత్తిడి పెరుగుతుందని వెల్లడించింది.
ప్రతి నలుగురిలో ముగ్గురు..
దేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురు 10 గంటల కన్నా ఎక్కువ కంప్యూటర్ స్క్రీన్ను చూస్తే కళ్లపై ఒత్తిడి పెరుగుతోందని తమ దగ్గరకు వస్తుంటారని ఆప్తమాలజిస్టులు చెప్పారు. 20 నుంచి 35 ఏళ్ల మంది యువత కళ్లు ఎర్రబడటం, ఇరిటేషన్, కళ్ల ఒత్తిడి అంటూ తమ దగ్గరకు వస్తుంటారన్నారు. కళ్లపై ఒత్తిడి పెరగడానికి చాలా రకాల కారణాలుంటాయని డాక్టర్లు చెప్పారు. కాంతి తక్కువగా ఉండటం వల్ల కళ్లపై ఒత్తిడి పెరగడం 64 శాతం వరకు ఉంటుందని, లైఫ్స్టయిల్ సరిగా లేకుంటే 92 శాతం, డయాబెటిస్ ఉంటే 82 శాతం కళ్లపై ఒత్తిడి, చూపుపై ప్రభావం పెరుగుతుందన్నారు. కనురెప్పలను ఆడించడంతో పోలిస్తే కళ్లు చూసేటప్పుడు ఉండే కాంతి కళ్ల ఒత్తిడి విషయంలో ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందని చాలా మంది డాక్టర్లు అన్నారు. బ్రైట్నెస్ ఎక్కువగా ఉండటం, కాంతిని వెదజల్లే వస్తువులు, పరికరాలు సరైన పొజిషన్లో లేకుంటే కళ్లపై ఎఫెక్ట్ ఉంటుందన్నారు.