తిండిలో విషాన్ని తగ్గిద్దాం

తిండిలో విషాన్ని తగ్గిద్దాం

హైద‌‌‌‌రాబాద్‌‌‌‌, వెలుగు: మనం తినే తిండి, పాలు, మాంసం దేంట్లో చూసినా పురుగు మందుల అవ‌‌‌‌శేషాలు ఎక్కువైపోతున్నయి. దీంతో లేనిపోని రోగాలు వస్తున్నయి. పురుగుమందులు ఎక్కువగా వాడిన ప్రాంతంలోని మేత తినే పశువులపైనా ప్రభావం పడుతోంది. అందుకే పంట ఉత్పత్తుల్లో పెస్టిసైడ్స్ అవశేషాలు ఎంత పరిమితిలోపు ఉంటే సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు? అనే అంశంపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్​ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) గైడెన్స్ డ్రాఫ్ట్‌‌ను రూపొందించింది. పురుగుమందుల అవశేషాలను గరిష్టంగా ఎంతవరకు అనుమతించొచ్చు? అనే దానిపై రూపొందించిన డ్రాఫ్ట్ ప్రొసీజర్‌‌పై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది.

నిపుణుల బృందం ఏర్పాటు

పంట ఉత్పత్తుల్లో మ్యాగ్జిమం రెసిడ్యూ లిమిట్ (ఎంఆర్ఎల్) ఎంత మోతాదులో ఉండాలన్న విషయంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ ఒక సైంటిఫిక్ వ‌‌‌‌ర్కింగ్ గ్రూప్‌‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఫీల్డ్ విజిట్ చేసి, ఆహార పంటల ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, మాంసం ఉత్పత్తుల్లో ఏ మేరకు పెస్టిసైడ్స్ ఉన్నాయో ప‌‌‌‌రీక్షించ‌‌‌‌నుంది. దాని ప్రకారం ఏ పెస్టిసైడ్‌‌‌‌ను ఎంత వాడుతున్నరు? అందులో మ‌‌‌‌నుషులకు, పశువులకు హాని చేసే విష పదార్థాలు ఎంత ఉన్నాయి? అనేవి పరిశీలిస్తారు. రోజూ తినే ఆహారంలో అన్ని కెమికల్స్ ఏయే స్థాయిల్లో ఉంటున్నాయనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. దీనిపై ఆయా రీసెర్చ్ సంస్థలతోనూ ఫీల్డ్ ట్రయల్స్ సమాచారం పంచుకుంటారు. చివరగా అంతర్జాతీయ, ఓఈసీడీ స్టాండర్డ్స్ ఆధారంగా ఎంఆర్ఎల్ గరిష్టంగా ఎంత ఉండాలనేది నిర్ణయిస్తారు. ఇందుకోసం గైడ్ లైన్స్‌‌ను పేర్కొంటూ డ్రాఫ్ట్‌‌ను రిలీజ్ చేశారు. 

లిమిట్ అవసరం 

నిరుడు కేంద్ర ప్రభుత్వం జరిపిన అధ్యయనంలో కొన్ని ప్రాంతాల్లో కూరగాయలు, బియ్యం, మసాలా దినుసుల్లో నిషేధిత పెస్టిసైడ్స్ ఆనవాళ్లను గుర్తించారు. అనుమతి ఉన్న పురుగుమందులనూ మితిమీరి వాడుతున్నారని, కొన్ని చోట్ల ఒక పంటకు వేయాల్సిన పురుగుమందులను వేరొక పంటకు వేస్తున్నారని తేలింది. ఇలా విచ్చలవిడిగా పెస్టిసైడ్స్ వాడుతుండటంతో పంట ఉత్పత్తుల్లో వీటి అవశేషాలు పెరుగుతున్నాయని వెల్లడైంది. పెస్టిసైడ్స్ విపరీతంగా కొట్టిన గడ్డి తింటున్న ఆవులు, బర్రెల పాలు, గొర్రెలు, మేకల మాంసంలోనూ పురుగుమందుల ఆనవాళ్లు ఉంటున్నాయి. పంటలను కాపాడుకోవడం కూడా ముఖ్యమే అయినందున, పురుగుమందుల వాడకానికి లిమిట్ పెట్టాల్సిన అవసరం ఉందని ఎఫ్ఎస్ఎస్ఏఐ తన డ్రాఫ్ట్ లో వివరించింది. పురుగుమందుల వాడకం విషయంలో ప్రభుత్వాలు అలర్ట్ కావాలని, రైతులు, డీలర్లకు అవగాహన కల్పించాలని పేర్కొంది. 

డ్రాఫ్ట్ లో స్పష్టత లేదు 

పురుగుమందులపై ఎమ్ఆర్ఎల్‌‌ను ఫిక్స్ చేయడానికి గైడెన్స్ డ్రాప్ట్ తేవడం మంచిదే. అయితే ఇందులో కొన్ని విషయాలపై స్పష్టత ఇవ్వలేదు. ఎమ్ఆర్ఎల్ కాకుండా, రోజులో ఒక మనిషి ఏయే ఆహారం ఎంత తింటున్నడు? అన్నీ కలిపి ఎంత మేర విష పదార్థాలు ఉన్నాయో తెలుసుకోవాలి. దీనిని లెక్కలోకి తీసుకుని ఎమ్ఆర్ఎల్​ను ఫైనల్ చేయాలి. ఫీల్డ్ లెవల్‌‌లో అనుభవాలనూ లెక్కలోకి తీసుకోవాలి. కొన్ని పెస్టిసైడ్స్ అసలు వాడకూడదు. వాటి విషయాన్నీ తేల్చాలి. 
- దొంతి నర్సింహారెడ్డి, ఎక్స్​పర్ట్