భీమదేవరపల్లి, వెలుగు : ట్రేడ్ లైసెన్స్ లేకుండా హోటల్ ఎలా నిర్వహిస్తారని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ లో తనిఖీలు చేసి, ట్రేడ్ లైసెన్స్ లేకుండా హోటళ్లు, రెస్టారెంట్లు నిర్వహించడంపై ఫైర్ అయ్యారు.
ఫుడ్ సేఫ్టీ అధికారి బ్రహ్మాజీ మాట్లాడుతూ ఆహార పదార్థాల తయారీ కేంద్రాల వద్ద తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలని, ఆహార పదార్థాల తయారీలో మోతాదుకు మించి రంగులు వాడకూడదన్నారు. కిరాణా దుకాణాల్లో గడువు ముగిసిన వస్తువులను అమ్మకూడదన్నారు. ఈ సందర్భంగా హోటళ్లలో నుంచి వివిధ రకాల ఆహార పదార్థాల శాంపిల్స్, కిరాణాల దుకాణం నుంచి నూనె, ఇతర వస్తువులు టెస్ట్ కోసం తీసుకువెళ్తున్నట్లు ఆయన తెలిపారు.
