
- భారీగా పెట్టుబడులు పెడుతున్న ఓపెన్ఏఐ, మైక్రోసాఫ్ట్, పర్ప్లెక్సిటీ, గూగుల్, ఎక్స్ఏఐ వంటి పెద్ద కంపెనీలు
- 70 కోట్ల మందికి పైగా ఇంటర్నెట్ యూజర్లు ఉండడమే కారణం
- పోటీ పడి మరి ప్లాన్ రేట్ల తగ్గింపు
- వీటిని ఎదుర్కోలేకపోతున్న ఇండియన్ స్టార్టప్లు
- ఇంకా లాంగ్వేజ్ మోడళ్లను డెవలప్ చేసే స్టేజ్లోనే..
న్యూఢిల్లీ: గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంపెనీలు ఇండియాపై ఫోకస్ పెంచాయి. ఓపెన్ఏఐ, గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్, పర్ప్లెక్సిటీఏఐ వంటి టాప్ కంపెనీలు తమ బిజినెస్ను విస్తరిస్తున్నాయి. యూజర్లను ఆకర్షించేందుకు తక్కువ రేట్లకే సర్వీస్లను అందిస్తున్నాయి. చాట్జీపీటీని నడిపే ఓపెన్ఏఐ తాజాగా ఢిల్లీలో తన ఆఫీస్ను ఓపెన్ చేసింది. గ్లోబల్ ఏఐ రేసులో ఇండియా ముందుంటుందని, ఇక్కడ టెక్ ట్యాలెంట్కు కొదవ లేదని ఈ కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్మన్ కామెంట్ చేశారు. ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్తో సపోర్ట్ చేస్తోందని అన్నారు. మరోవైపు ఏఐ, టెక్నాలజీ రంగాల్లో ఇండియా అత్యంత కీలకమైన మార్కెట్ అని మైక్రోసాఫ్ట్ ఇండియా అధ్యక్షుడు పునీత్ చందోక్ పేర్కొన్నారు. యువత ఏఐ స్కిల్స్ పెంచుకోవాలని , ఇది చాలా కీలకమని సలహా ఇచ్చారు.
గూగుల్ జెమిని కూడా ఇండియాపై ఫోకస్ పెంచింది. ఏఐ సర్వీస్ ప్లాన్ రేట్లను తగ్గించింది. గ్లోబల్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్లను పెంచడంతో ఇండియాలో ఏఐ ప్రొఫెషనల్స్ వేగంగా పెరుగుతున్నారు. ప్రస్తుతం 6 లక్షల మంది నిపుణులు ఉన్నారని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) ఓ రిపోర్ట్లో పేర్కొంది. 2027 నాటికి ఈ నెంబర్ 12.5 లక్షలకు చేరే అవకాశం ఉందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ టాలెంట్లో 16శాతం భారత్లోనే ఉండడం విశేషం. అమెరికా తర్వాత రెండవ స్థానంలో ఉన్నాం. సైన్స్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్మెటిక్స్ (స్టెమ్) విద్యా వ్యవస్థ, అధిక జనాభా ఇందుకు కారణం. ఏఐ సెక్టార్లో చైనా, అమెరికా మధ్య పోటీ తీవ్రం అవ్వడంతో చాలా యూఎస్ కంపెనీలు ఇండియా తమకు అనుకూలమని భావిస్తున్నాయి.
తక్కువ రేట్లకే సర్వీస్లు..
ఓపెన్ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్, పర్ప్లెక్సిటీ భారత వినియోగదారులకు తగ్గట్టు ప్లాన్లను తీసుకొస్తున్నాయి. గూగుల్ జెమిని ప్రీమియం ప్లాన్ రేట్లు నెలకు రూ.1,950 గా ఉంది. ఈ ఏఐ సర్వీస్లు జీమెయిల్, డాక్స్, మీట్, ఆండ్రాయిడ్ వంటి సేవలతో పూర్తిగా అనుసంధానమవుతుంది. పర్ప్లెక్సిటీఏఐ ఫౌండర్ అర్వింద్ శ్రీనివాస్ ఇండియనే. ఈ కంపెనీ ఏఐ సెర్చ్ ఇంజిన్గా ఎదుగుతోంది. ఎయిర్టెల్తో భాగస్వామ్యం ద్వారా ఏడాదికి రూ.17 వేలు ఖర్చయ్యే ప్రో ప్లాన్ను లక్షల మంది టెలికాం వినియోగదారులకు ఉచితంగా అందిస్తోంది. ఎలాన్ మస్క్ కంపెనీ ఎక్స్ఏఐ సూపర్ గ్రోక్ను నెలకు రూ.700 కు భారత్లో ప్రారంభించింది. అంతర్జాతీయ ధరతో పోలిస్తే ఇది భారీ తగ్గింపు. ఇండియాలో 70 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉండడం, ఏఐ వాడకం పెరుగుతుండడంతో ధరల యుద్ధం ప్రారంభమైంది. గ్రామర్లీ తన సబ్స్క్రిప్షన్ను నెలకు రూ.250 కి తగ్గించింది. గూగుల్ విద్యార్థులకు జెమినీ ప్రోను ఉచితంగా అందిస్తోంది. ఓపెన్ఏఐ నెలకు రూ.399 ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇది కూడా అంతర్జాతీయ రేట్లతో పోలిస్తే చాలా తక్కువ.
మన కంపెనీలు ఎక్కడ ?
భారతీయ ఏఐ స్టార్టప్లకు గ్లోబల్ కంపెనీల నుంచి పోటీ పెరిగింది. కృత్రిమ్, సర్వమ్ ఏఐ, భారత్జీపీటీ వంటి యూనికార్న్లు "ఇండియా- ఫస్ట్" లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లను అభివృద్ధి చేస్తుండగా, క్యూరే.ఏఐ, నిరమ్ఏఐ, మ్యాడ్స్ట్రీట్ డెన్, యెల్లో.ఏఐ వంటి సంస్థలు ఆరోగ్యం, ఫ్యాషన్, కస్టమర్ సపోర్ట్ రంగాల్లో విస్తరిస్తున్నాయి. అయితే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ, పర్ప్లెక్సిటీ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు తక్కువ ధరలకు శక్తివంతమైన మోడళ్లను అందించడమే కాకుండా, భారతదేశంలోని టాప్ టాలెంట్ను ఆకర్షిస్తున్నాయి. దీని వల్ల దేశీయ సంస్థలు ప్రత్యక్ష పోటీలో నిలవడం కష్టంగా మారుతోంది. ఫౌండేషన్ మోడళ్లను అభివృద్ధి చేయాలంటే భారీగా పెట్టుబడులు పెట్టాలి. ఈ నేపథ్యంలో, భారత స్టార్టప్లు సహకార మార్గాన్ని ఎంచుకోవడం అవసరం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. విద్యా సంస్థలతో భాగస్వామ్యం, ప్రభుత్వ మద్దతు లేదా గ్లోబల్ సంస్థలతో భాగస్వామ్యానికి మొగ్గు చూపొచ్చన్నారు.