
- మార్కెట్లో విదేశీ పెట్టుబడులు రూ.1.5 లక్షల కోట్లు
- డెట్ మార్కెట్లోకి మరో రూ.60 వేల కోట్లు
- ఈ ఏడాదిని నెగెటివ్లో స్టార్ట్ చేసి పాజిటివ్గా ముగిస్తున్న ఎఫ్పీఐలు
- వచ్చే ఏడాది కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని అంచనా
న్యూఢిల్లీ: ఇండియన్ మార్కెట్లపై విదేశీ ఇన్వెస్టర్లకు ఆసక్తి పెరిగింది. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నికరంగా రూ.1.5 లక్షల కోట్లు విలువైన షేర్లను విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) కొనుగోలు చేశారు. గ్లోబల్ ఎకానమీ మందగించినా, ఇండియా స్ట్రాంగ్గా నిలబడింది. విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ల వైపు చూడడానికి ఇదొక కారణం. ఇలాంటి ట్రెండే వచ్చే ఏడాది కూడా కనిపిస్తుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. కాగా, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడంతో కిందటేడాది ఇండియన్ మార్కెట్ నుంచి నికరంగా రూ.1.22 లక్షల కోట్లు వెళ్లిపోయాయి. అంతకు ముందు మూడు సంవత్సరాల్లోనూ ఇండియన్ మార్కెట్లో నికర కొనుగోలుదారులుగా ఎఫ్పీఐలు నిలిచారు.
వచ్చే ఏడాది పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయని, రాజకీయ స్థిరత్వం మార్కెట్ ట్రెండ్ను నిర్ణయిస్తుందని మార్నింగ్స్టార్ ఇండియా డైరెక్టర్ హిమాన్షు శ్రీవాత్సవ అన్నారు. అంతేకాకుండా దేశ జీడీపీ గ్రోత్పై ఫోకస్ పెడతారని చెప్పారు. గ్లోబల్గా చూస్తే ఫెడ్ మానిటరీ పాలసీని బట్టి దేశంలో ఎఫ్పీఐలు ఇన్వెస్ట్ చేయడమా? లేక తమ ఫండ్స్ను బయటకు తీసేయడమా? అనేది ఆధారపడుతుందన్నారు. మిగిలిన దేశాలతో పోలిస్తే ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్గా కనిపిస్తోందని, విదేశీ ఇన్వెస్ట్మెంట్లు మార్కెట్లోకి భారీగా వస్తాయని ఆయన అంచనా వేశారు.
డిసెంబర్లోనే ఎక్కువ..
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నికరంగా రూ.1.5 లక్షల కోట్లను షేర్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టారు. మరో రూ. 60 వేల కోట్లను బాండ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. ఈ రూ.1.5 లక్షల కోట్లలో రూ. 43 వేల కోట్లు ఈ నెలలోని మొదటి రెండు వారాల్లోనే ఇన్వెస్ట్ చేశారు. కీలక రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో దేశంలో రాజకీయ స్థిరత్వం కొనసాగుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
ఎఫ్పీఐలు 2021 లో నికరంగా రూ.25,752 కోట్లను మార్కెట్లో ఇన్వెస్ట్ చేయగా, 2020 లో రూ.1.7 లక్షల కోట్లను, 2019 లో రూ.1.01 లక్షల కోట్లను పెట్టారు. యూకే, యూఎస్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు వడ్డీ రేట్లు పెంచడంతో పాటు, క్రూడాయిల్ ధరలు పెరగడం, జియోపొలిటికల్ టెన్షన్ల కారణంగా 2022 లో నికర అమ్మకందారులుగా మారారు.
దేశ ఎకానమీ స్ట్రాంగ్గా ఉండడంతోనే విదేశీ ఇన్వెస్ట్మెంట్లు భారీగా వచ్చాయని మజార్స్ మేనేజింగ్ పార్టనర్ భరత్ ధావన్ అన్నారు. ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు చేపడుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారని చెప్పారు. వీటికి తోడు కంపెనీల రిజల్ట్స్ మెరుగ్గా ఉండడం, గ్లోబల్గా లిక్విడిటీ సమస్యలు మెరుగవ్వడం, దేశ ఎకానమీ లాంగ్టెర్మ్లో పెరుగుతుందనే నమ్మకం బలపడడంతో ఇండియాలోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. విదేశీ ఇన్వెస్టర్లకు టాప్ డెస్టినేషన్గా ఇండియా మారిందన్నారు.
మార్చి నుంచి టాప్ గేర్
వరుసగా మూడేళ్ల పాటు ఇండియన్ డెట్ మార్కెట్లో నికర అమ్మకందారులుగా మిగిలిన విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది రూ. 60 వేల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. 2022 లో రూ.15,910 కోట్లు, 2021 లో రూ.10,359 కోట్లు, 2020 లో రూ.1.05 లక్షల కోట్లను డెట్ మార్కెట్ నుంచి తీసేశారు. తన బెంచ్మార్క్ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్లో ఇండియన్ బాండ్లను యాడ్ చేస్తామని జేపీ మోర్గాన్ ప్రకటించినప్పటి నుంచి డెట్ మార్కెట్లోకి ఇన్ఫ్లోస్ పెరిగాయని స్మాల్కేస్ మేనేజర్ మయాంక్ మెహ్రా అన్నారు. వచ్చే ఏడాది జూన్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుండగా, రెండేళ్లలోనే సుమారు 20–40 బిలియన్ డాలర్ల పెట్టుబడులు డెట్ మార్కెట్లోకి వస్తాయని అంచనా.
జేపీ మోర్గాన్ బెంచ్మార్క్ ఇండెక్స్లో ప్రభుత్వ బాండ్లు యాడ్ అయితే ఫారిన్ ఇన్వెస్టర్లు మరింత ఈజీగా వీటిలో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. ఫలితంగా రూపాయి బలపడుతుంది. ఎఫ్పీఐలు ఫైనాన్షియల్, ఐటీ, ఫార్మా, ఎనర్జీ సెక్టార్లలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు. కాగా, విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాదిని నెగెటివ్లో స్టార్ట్ చేశారు. మొదటి రెండు నెలల్లో నికరంగా రూ.34 వేల కోట్లను వెనక్కి తీసేసుకున్నారు. కానీ, మార్చి తర్వాత నుంచి గేర్ మార్చారు. మార్చి – ఆగస్టు మధ్య నికరంగా రూ.1.74 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు.