
- 15 ఎకరాల అటవీభూమి స్వాధీనం, పలువురిపై కేసు
లింగంపేట, వెలుగు : ఫారెస్ట్ భూముల ఆక్రమణలపై గురువారం ఎల్లారెడ్డి అటవీరేంజ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. మండలంలోని మాలోత్తండా, పర్మల్ల అటవీ ప్రాంతంలో 15 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని, పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి ఫారెస్ట్రేంజ్ ఆఫీసర్ ఓంకార్ తెలిపారు. ఆక్రమణకు గురైన భూముల్లో జేసీబీలతో కందకాలు తవ్వించామన్నారు.
పర్మల్ల అటవీ బీట్ పరిధిలో కొంతకాలంగా చెట్లను నరికి భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నారన్న సమాచారం మేరకు ఎల్లారెడ్డి, అటవీరేంజ్ సిబ్బంది, స్థానిక పోలీసులతో వెళ్లి సర్వే నిర్వహించామని చెప్పారు. కార్యక్రమంలో రేంజ్ ఆఫీసర్ ఓంకార్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు శ్రీనునాయక్, పృథ్వీ, ఎఫ్ఎస్వోలు విక్కీ మార్టిన్, భాస్కర్, వినోద్, బీట్ ఆఫీసర్లు సాయికిరణ్, అనిత, శ్రీనివాస్, శారద, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.