
గజ్వేల్, వెలుగు: ప్రశ్నించడాన్ని పౌరసమాజం అలవర్చుకోవాలని కేంద్ర సమాచార మాజీ కమిషనర్, నల్సార్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. జగదేవ్పూర్లో గజ్వేల్ ప్రెస్ క్లబ్ 25 ఏళ్ల వేడుక సందర్భంగా కేశిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గార్డెన్స్ లో "జర్నలిస్టు విలువలు.. -పౌర సమాజం పాత్ర" అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ప్రధాన వక్తగా హాజరై మాట్లాడారు. ఏకే-47 తుపాకి కాలిస్తే చావడం లేదా చంపడం మాత్రమే జరుగుతుందని, ఒక ప్రశ్న కోట్లాది మందిని ఆలోచింపజేస్తుందన్నారు.
చచ్చిపోవడానికి సిద్ధమైన వాడు సైనికుడైతే, పౌర సమాజ సైనికుడు జర్నలిస్టు అన్నారు. సమాచార కమిషనర్ గా తాను 25 వేల ప్రశ్నలకు జవాబులు ఇచ్చానన్నారు. తెలంగాణ కోసం 75 ఏళ్ల పోరాటం ఫలించడంలో తన పాత్ర కూడా ఉందన్నారు. గజ్వేల్ ప్రెస్ క్లబ్ అనేక మంది అభాగ్యులకు గొంతుకగా మారి అండగా నిలిచిందని టీయూడబ్ల్యూజే స్టేట్ ప్రెసిడెంట్ ఖాజా విరాహాత్ అలీ అన్నారు.
ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులను తప్పక ఆదరిస్తారన్నారు. గజ్వేల్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టు విలువలతో పనిచేస్తుంది కాబట్టే 25 యేండ్ల వేడుకలు ప్రజల భాగస్వామ్యంతో జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాంరెడ్డి, డీటీ రఘువీరారెడ్డి, ఫాక్స్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎంపీపీ బాలేశం, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, ప్రెస్ క్లబ్ సభ్యులు సురేందర్, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.