- బండ్లగూడ చౌరస్తా- కిస్మత్ పురా రూట్లో గుంతలతో అధ్వానంగా రోడ్డు
గండిపేట, వెలుగు: బైక్ అదుపుతప్పి శాసనమండలి మాజీ చైర్మన్, బీజేపీ నేత స్వామి గౌడ్ గాయపడ్డ ఘటన బండ్లగూడ చౌరస్తాలో జరిగింది. శనివారం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా గండిపేట మండల పరిధిలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన బైక్ ర్యాలీని నిర్వహించారు. బండ్లగూడ చౌరస్తా నుంచి కిస్మత్ పురాలో ఇంటికి బైక్ పై వెళ్తుండగా.. అదుపుతప్పి ఆయన కిందపడిపోయారు.
ప్రమాదంలో స్వామి గౌడ్ ఎడమ కాలికి గాయాలు కాగా.. స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. కాలికి ఫ్రాక్చర్ అయినట్లు డాక్టర్లు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు బండ్లగూడ జాగీర్ చౌరస్తా– కిస్మత్ పురా రూట్లో రోడ్డు గుంతలతో మరీ దారుణంగా తయారైందని స్వామి గౌడ్ తెలిపారు. గుంతల కారణంగానే బైక్ స్కిడ్ అయ్యిందన్నారు. హెల్మెట్ పెట్టుకోవడం వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానన్నారు. రోడ్లు పూర్తిగా గుంతలమయమై వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని అధికారులకు గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు.