చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌ కన్నుమూత

చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌ కన్నుమూత

చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌ (96) షాంఘైలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలత బాధపడుతున్న జియాంగ్‌ జెమిన్‌ మృతిచెందారని జిన్హువా న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. జియాంగ్‌ జెమిన్ మృతిని ప్రకటిస్తూ కమ్యూనిస్టుపార్టీ, పార్లమెంట్‌, మంత్రివర్గం, సైన్యం జారీ చేసిన ఓ లేఖను కూడా ప్రచురించింది. ‘‘పార్టీకి, సైన్యానికి, చైనా జాతికి జియాంగ్‌ జెమిన్‌ మరణం తీరని లోటు. ఆయన మరణం మాకు తీవ్ర వేదన మిగిల్చింది. జెమిన్‌ మంచి వ్యూహకర్త, గొప్ప దౌత్యవేత్త, పార్టీ అత్యున్నత నాయకుడు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

1989లో తియానన్మెన్‌ స్క్వేర్‌ ఘటన తర్వాత డెంగ్‌ షావోపింగ్‌ నుంచి  జెమిన్‌ అధికారం చేపట్టారు. అప్పటికే అంతర్జాతీయంగా చైనా తీవ్ర విమర్శలు, ఆరోపణలను మూటగట్టుకుంది. దానిని తిరిగి గాడినపెట్టిన ఘనత జియాంగ్‌ జెమిన్‌కే దక్కుతుంది. హాంకాంగ్‌పై పట్టు సాధించడం, 2008 ఒలింపిక్స్ బిడ్‌ను గెలుచుకోవడం, ప్రపంచ వాణిజ్య సంస్థలో భాగస్వామి కావడం వంటి కీలక పరిణమాలు జియాంగ్ జెమిన్ హాయంలోనే జరిగాయి. 2002లో జియాంగ్‌ జెమిన్‌ పదవీ విరమణ చేసే నాటికి చైనా దాదాపు సూపర్‌పవర్‌ హోదాను అందుకొంది.

జెమిన్‌ చైనా కమ్యూనిస్టు పార్టీలో అత్యంత కీలకమైన షాంఘై గ్యాంగ్‌ వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన రాజకీయాల నుంచి వైదొలగినా పార్టీలో చాలాకాలం ఆయన వర్గం బలంగా ఉంది. షీజిన్‌పింగ్‌ అధికారం చేపట్టాక జియాంగ్‌ జెమిన్‌ వర్గాన్ని అణచి వేశారనే ప్రచారం జరిగింది. చైనా కుబేరుల్లో ఒకరైన అలీబాబా గ్రూప్‌ అధినేత జాక్‌ మా బిజినెస్‌ టైకూన్‌గా మారటంలో జియాంగ్‌ జెమిన్‌ పాత్ర చాలా ఉందని చెబుతారు.