డీసీసీబీ డైరెక్టర్‌‌‌‌ కిడ్నాప్‌‌‌‌కు మాజీ డ్రైవరే సూత్రధారి

డీసీసీబీ డైరెక్టర్‌‌‌‌ కిడ్నాప్‌‌‌‌కు మాజీ డ్రైవరే సూత్రధారి
  • ..ఆరుగురిని అరెస్ట్‌‌‌‌ చేసిన పోలీసులు

నిర్మల్, వెలుగు : నిర్మల్‌‌‌‌ జిల్లా మామడ మండలం పోన్కల్‌‌‌‌ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ, డీసీసీబీ డైరెక్టర్‌‌‌‌ చిట్యాల హరీశ్‌‌‌‌రావు కిడ్నాప్‌‌‌‌ వ్యవహారంలో అతడి వద్ద పనిచేసిన మాజీ డ్రైవరే సూత్రధారి అని పోలీసులు తేల్చారు. ఈ క్రమంలో కిడ్నాప్‌‌‌‌కు పాల్పడిన మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ జానకి షర్మిల శుక్రవారం వెల్లడించారు.

పొన్కల్‌‌‌‌ గ్రామానికే చెందిన షేక్‌‌‌‌ హైదర్‌‌‌‌ కొంతకాలం కింద హరీశ్‌‌‌‌రావు వద్ద డ్రైవర్‌‌‌‌గా పనిచేశాడు. అయితే హైదర్‌‌‌‌ ప్రవర్తన నచ్చకపోవడంతో ఆరు నెలల కింద అతడిని పనిలో నుంచి తీసేశాడు. దీంతో కోపం పెంచుకున్న హైదర్‌‌‌‌ ఎలాగైనా హరీశ్‌‌‌‌రావును హత్య చేసి డబ్బు, బంగారం దొంగిలించాలని ప్లాన్‌‌‌‌ వేశాడు. ఇందులో భాగంగా అదే గ్రామానికి చెందిన తన ఫ్రెండ్‌‌‌‌ మధుసూదన్‌‌‌‌, గుంటూరుకు చెందిన బాణాల ప్రిన్స్‌‌‌‌, విజయవాడకు చెందిన తట్టూరి రవి, కలకంటి సురేశ్‌‌‌‌, గూడె కోటేశ్వరరావుతో కలిసి హైదరాబాద్‌‌‌‌ పటాన్‌‌‌‌చెరువులో ఓ కారును అద్దెకు తీసుకున్నారు.

వీరంతా ఈ నెల 15న పొన్కల్‌‌‌‌ గ్రామంలోని హరీశ్‌‌‌‌రావు ఇంటికి వచ్చి అతడి కాళ్లు, చేతులు కట్టేసి బంగారు చైన్‌‌‌‌, రెండు గోల్డ్‌‌‌‌ కాయిన్స్‌‌‌‌, డైమండ్‌‌‌‌ రింగ్‌‌‌‌, రూ. 5 వేలు తీసుకున్నారు. తర్వాత హరీశ్‌‌‌‌రావును అతడి కారులోనే ఎక్కించి హైదరాబాద్‌‌‌‌ వైపు బయలుదేరారు. కారులో వెళ్తుండగానే రూ. 3 కోట్లు ఇవ్వాలని కత్తులతో బెదిరించారు. ఈ క్రమంలో మనోహరాబాద్‌‌‌‌ టోల్‌‌‌‌ప్లాజా వద్దకు రాగానే హరీశ్‌‌‌‌రావు కారు నుంచి బయటకు దూకి గట్టిగా అరవడంతో టోల్‌‌‌‌ప్లాజా సిబ్బంది అక్కడికి వచ్చారు.

దీంతో భయపడిన నిందితులు అక్కడి నుంచి పరార్‌‌‌‌ అయి టోల్‌‌‌‌ప్లాజాకు కొంత దూరంలో హరీశ్‌‌‌‌రావు కారును వదిలి, తాము తెచ్చుకున్న కారులో పరార్‌‌‌‌ అయ్యారు. కిడ్నాప్‌‌‌‌ విషయం తెలుసుకున్న ఎస్పీ జానకి షర్మిల ఏఎస్పీ రాజేశ్‌‌‌‌ మీనాతో ప్రత్యేక టీమ్‌‌‌‌ను నియమించి నిందితుల కోసం గాలింపు చేపట్టి ఆరుగురు నిందితులను హైదరాబాద్‌‌‌‌లో అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల నుంచి కారుతో పాటు బంగారు చైన్‌‌‌‌, బాధితుడి పర్స్, ఆరు సెల్‌‌‌‌ఫోన్లు, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న ఏఎస్పీ రాజేశ్‌‌‌‌ మీనాతో పాటు ఇన్‌‌‌‌స్పెక్టర్లు గోవర్ధన్‌‌‌‌రెడ్డి, కృష్ణ, సమ్మయ్య, ఎస్సైలు ప్రదీప్, శ్రీనివాస్, లింబాద్రి, శ్రీకాంత్, అశోక్‌‌‌‌ను ఎస్పీ అభినందించారు.