కేటీఆర్ మున్సిపాలిటీ మంత్రిగా పనికిరారు

కేటీఆర్ మున్సిపాలిటీ మంత్రిగా పనికిరారు

కేటీఆర్ ఓ హైటెక్ మంత్రి అని, మున్సిపాలిటీ మంత్రిగా ఆయన పనికిరారని కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. మున్సిపల్ చట్టంలో మార్పులతో కౌన్సిలర్లకు గౌరవం లేకుండా చేశారని మండిపడ్డారు. 500 సెక్షన్లు ఉన్న చట్టాలను 226కు కుదించారన్నారు. దీని వల్ల కౌన్సిలర్లకు ఎలాంటి పవర్స్ లేకుండా పోయాయని.. వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ఫైర్ అయ్యారు. సిరిసిల్లలో దళితులపై చాలా దాడులు జరిగాయని.. క్యాంపు రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. 

‘సిరిసిల్లలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ రెబల్ క్యాండిడేట్లు 12 మంది గెలిచారు. దీనికి ఏం సమాధానం చెబుతారు? మీ మీద వ్యతిరేకత విపరీతంగా ఉంది. కేటీఆర్ ఓ ప్రశ్న అడుగుతున్నా.. ఏనాడైనా రాష్ట్రంలోని కౌన్సిలర్లకు ఒక్కటైనా శిక్షణా శిబిరం పెట్టారా? ఓట్ల కోసం క్యాంపులు పెడతారు. విహార యాత్రలకు తీసుకెళ్తారు. సిరిసిల్లలో ఏ ఒక్క ఇసుక లారీ అయినా లీగల్ గా పోతుందా చెప్పాలి. హైటెక్ మంత్రి జనాల్లో ఉండాలి. ఏం చూసుకుని ఓటెయ్యాలో చెప్పండి. భాను ప్రసాద్ ఈ పన్నెండేళ్లలో ఏనాడైనా సిరిసిల్లకు వచ్చి కౌన్సిలర్లతో సమావేశం పెట్టాడా? ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో మాట్లాడాడా? ఆయన ఇక్కడ ఓటు కూడా లేదు. అలాంటి భాను ప్రసాద్ ఏ విధంగా ఓటెయ్యాలో చెప్పాలి’ అని సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు.  

‘ఈ ఎన్నికలను ఏకగ్రీవం కానివ్వం. నేను నామినేషన్ వేశానని పెద్ద ఎత్తున క్యాంపులు పెడుతున్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లకు నేను విన్నపం చేస్తున్నా.. మీరు క్యాంపుల్లో ఎంజాయ్ చేయండి. అవి మీ పైసలతో ఏర్పాటు చేసినవే. మీ డబ్బులతో మీ కోసం క్యాంపులు పెడుతున్నరు. నా నామినేషన్ తో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు గౌరవం పెరిగింది. నేను నామినేషన్ వేసినందుకే ఎన్నికలు జరుగుతున్నయ్. నా వల్లే  ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు తొలిసారి సమయానికి జీతాలు పడ్డాయి. నేను గెలిస్తే  సరికొత్త కార్యక్రమాలతో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల గౌరవాన్ని కాపాడతా. ధనబలం, కండబలం, అండబలంతో పోరులో నా వైపు ఉన్నది కేవలం ఆత్మగౌరవమే’ అని రవీందర్ సింగ్ చెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు జాతీయ జెండా ఎగరవేసేందుకు ఎంపీటీసీలకు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది వాళ్ల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని స్పష్టం చేశారు.