
- న్యాయసూత్రాలు, రాజ్యాంగ సంప్రదాయాలన్నీ పార్టీలకు ఒకే రకంగా ఉండాలి
హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీల రహస్య మైత్రి మరోసారి బయపటపడిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంతో ఇరు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్టబయలైందని విమర్శించారు.
‘బీజేపీ ఎజెండా మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి మేలు చేసేలా గవర్నర్ తమిళిసై పనిచేస్తున్నరు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను పార్టీల్లో ఉన్నారంటూ ఎమ్మెల్సీలుగా నియమించేందుకు గవర్నర్ నిరాకరించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఏకంగా ఒక పార్టీ అధ్యక్షుడిని సిఫారసు చేస్తే ఆమోదించారు.
ఇది ద్వంద్వ నీతి కాదా? కాంగ్రెస్ అనుకూలంగా వ్యవహరించడం కాదా? గతంలో క్రీడా, సాంస్కృతిక, విద్యా, సామాజిక, సేవా రంగాల్లో కృషి చేసిన వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది. అప్పుడు కూడా రాజకీయ కారణాలతో ఆమోదించలేదు. మరీ ఇప్పుడు ఎందుకు ఆమోదించారు?
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కాలని చూస్తున్నాయి. ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరం. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలి. కానీ బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు తేడా చూపిస్తున్నరు’ అని హరీశ్రావు ట్వీట్చేశారు.