మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎట్టకేలకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2023 ఆగస్టు 03 శుక్రవారం రోజున ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో జూపల్లి పార్టీలో చేరారు. ఆయనకు ఖర్గే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూపల్లితో పాటుగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి, మల్లు రవి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
వాస్తవానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన కొన్ని రోజులకు జూపల్లి కూడా పార్టీలో చేరాల్సి్ంది. కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రియాంక గాంధీ సమక్షంలో ఆయన పార్టీలో చేరాలని అనుకున్నారు. కానీ వర్షాల కారణంగా ఆ సభ రద్ధు కావడంతో జూపల్లి చేరిక కూడా వాయిదా పడింది. ఆ తరువాత 2023 ఆగస్టు 02న మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ఆయన పార్టీలో చేరేందుకు ఢిల్లీకి వెళ్లారు. కానీ రాష్ట్రపతి ముర్మతో ప్రతిపక్ష నేతల అపాయింట్ మెంట్ నేపథ్యంలో మరోసారి జూపల్లి చేరిక వాయిదా పడింది. తాజాగా ఆయన ఈరోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.