జూబ్లీహిల్స్, వెలుగు: మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పోలీసుల ఎదుట హాజరయ్యాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో గురువారం సుమంత్ తన న్యాయవాదులు, ఇద్దరు ష్యూరిటీలతో కలిసి విచారణకు వచ్చారు. ఆయనకు నాంపల్లి కోర్టు బుధవారం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు రూ.25 వేల చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాల్సి ఉంది. కేసు నమోదైన తర్వాత సుమంత్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఆయన ఆచూకీ కోసం పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, సుమంత్ పోలీసులకు చిక్కలేదు. ఈక్రమంలో కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన స్వయంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చి విచారణకు హాజరయ్యారు. పోలీసులు న్యాయపరమైన ప్రక్రియను పూర్తి చేసి సుమంత్ను విచారించారు. కేసు విషయంలో పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరుకావాలని సూచించారు.
