ఆ కారు నడిపింది షకీల్ కొడుకే

ఆ కారు నడిపింది షకీల్ కొడుకే

 

  • 23న అర్ధరాత్రి ప్రజాభవన్ వద్ద కారుతో బారికేడ్లను ఢీకొట్టిన సోహెల్
  • కేసు నుంచి అతన్ని తప్పించేందుకు పంజాగుట్ట పోలీసుల ప్రయత్నం
  • షకీల్​ ఇంట్లో పని చేసే అబ్దుల్​ను నిందితుడిగా చేర్చిన పోలీసులు
  • అంతర్గత విచారణలో తేల్చిన వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్
  • ఇన్​స్పెక్టర్ దుర్గారావుపై సస్పెన్షన్ వేటు.. పరారీలో సోహెల్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ప్రజాభవన్ వద్ద ఈ నెల 23న అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణం బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ అని విచారణలో తేలింది. టీఎస్ 13 ఈటీ 0777 నంబర్ బీఎండబ్ల్యూ కారు వేగంగా వచ్చి ప్రజాభవన్ ముందు ఉన్న బారికేడ్లను ఢీకొట్టింది. కారు నడిపింది సోహెల్ అయినప్పటికీ.. నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. సోహెల్ ప్లేస్​లో అతని ఇంట్లో పని చేసే అబ్దుల్ ఆసిఫ్​ను నిందితుడిగా చేర్చేందుకు ట్రై చేసినట్లు ఎంక్వైరీలో తేలింది. ర్యాష్ డ్రైవింగ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. అప్పుడు కారులో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ప్రస్తుతం సోహెల్ పరారీలో ఉన్నాడు.

ఆ రోజు రాత్రి ఏం జరిగింది?

23వ తేదీన అర్ధరాత్రి 2.45 గంటలకు ప్రజాభవన్ ముందున్న బారికేడ్లను సోహెల్​ కారు ఢీకొట్టింది. పంజాగుట్ట పోలీసులు వెంటనే స్పాట్​కు చేరుకున్నారు. కారు నడిపింది సోహెల్​గా గుర్తించారు. బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ కోసం పంజాగుట్ట స్టేషన్​కు తీసుకెళ్లారు. షకీల్ అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్​కు వచ్చినట్లు సమాచారం. సోహెల్​ను కేసు నుంచి తప్పించి.. అతని ఇంట్లో పని చేస్తున్న అబ్దుల్ ఆసిఫ్​ను నిందితుడిగా చేర్చే ప్రయత్నం చేశారు.

సీసీ టీవీ ఫుటేజీ పరిశీలన

బ్రీత్ ఎనలైజ్ టెస్ట్​కు తీసుకెళ్తున్న టైమ్​లో సోహెల్ పారిపోయాడని ప్రచారం జరిగింది. పోలీసులు కేసును తప్పుదోవ పట్టించారన్న విషయం సీపీ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన అంతర్గత విచారణకు ఆదేశించారు. సీపీ ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఎంక్వైరీ చేశారు. ప్రజాభవన్ నుంచి పోలీస్ స్టేషన్ దాకా ఉన్న సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. స్టేషన్​లోని కెమెరాలను చూశారు. సోహెల్​ను స్టేషన్​కు తీసుకొచ్చినట్లు గుర్తించారు. నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు సోహెల్​ను తప్పించి అబ్దుల్ ఆసిఫ్ ను నిందితుడిగా చేర్చినట్లు డీసీపీ విజయ్ కుమార్ కు అర్థమైంది. ఆ రోజు నైట్ డ్యూటీలో సీఐ దుర్గారావు, ఏఎస్ఐ విజయ్​కాంత్ ఉన్నట్లు గుర్తించారు. కాగా, విచారణ జరుపుతున్న టైమ్​లో ఇన్​స్పెక్టర్ దుర్గారావు అస్వస్థతకు గురికాగా.. అతన్ని కేర్ హాస్పిటల్​కు తరలించారు. తర్వాత ఇన్​స్పెక్టర్ దుర్గారావును సీపీ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు.

ఏ1గా సోహెల్, ఏ2గా అబ్దుల్

నిందితులను కోర్టులో ప్రొడ్యూస్ చేసే టైమ్​లో సోహె ల్ పేరు ఎఫ్ఐఆర్​లో లేదు. అంతర్గత విచారణ తర్వాత రిమాండ్ రిపోర్టులో మాత్రం ఏ1గా సోహెల్​ను, ఏ2గా అబ్దుల్​ను చేర్చారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ మాట్లాడారు. ‘‘ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశాం. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ కారు డ్రైవ్ చేసినట్లుగా గుర్తించాం. అయితే.. సోహెల్‌‌‌‌‌‌‌‌కు బదులు అతని ఇంట్లో పనిచేసే అబ్దుల్ ఆసిఫ్‌‌‌‌‌‌‌‌ తానే డ్రైవ్ చేసినట్లుగా పోలీసులకు వచ్చి చెప్పాడు. సోహెల్ పరారీలో ఉన్నాడు. మిగిలినవారిని అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించాం’’అని వెల్లడించారు.