
ఆదిలాబాద్, వెలుగు: నకిలీ పత్రాలతో ఏకంగా వారసుడిని సృష్టించి 25 ఎకరాల భూమిని కొట్టేసిన మాజీ సర్పంచ్ను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ కె.ఫణిధర్ తెలిపారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలో 1954లో ప్రభుత్వం అమీనుద్దీన్ ఖాన్ అనే వ్యక్తికి కజ్జర్ల గ్రామ శివారులో 25 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అమీనుద్దీన్ కు ఒక కూతురు మాత్రమే ఉంది. ప్రభుత్వం కేటాయించిన స్థలం చాలా ఏండ్లుగా ఖాళీగా ఉండడంతో ఆ స్థలాన్ని ఎలాగైనా కబ్జా చేయాలనే ఉద్దేశంతో తలమడుగు మాజీ సర్పంచ్ కరుణాకర్ రెడ్డి కుట్ర చేసినట్లు సీఐ తెలిపారు. అమీనుద్దీన్ మనువడిగా షేక్ లతీఫ్ అనే వ్యక్తిని సృష్టించి తలమడుగు రెవెన్యూ అధికారుల నుంచి డిపెండెంట్ సర్టిఫికెట్ తీసుకున్నట్లు చెప్పారు.
ఈ డిపెండెంట్ సర్టిఫికెట్ ఆధారంగా అమీనుద్దీన్ పేరుపై ఉన్న 25 ఎకరాల స్థలాన్ని 2005లో షేక్ లతీఫ్ పేరుపై బదిలీ చేశారు. ఇది అసైన్డ్ ల్యాండ్ కావడంతో 2009లో ఆర్డీవో నుంచి నో అబ్జెక్షన్ లెటర్ తీసుకున్న తర్వాత ప్రధాన సూత్రధారి అయిన కరుణాకర్ రెడ్డి, నాలుగు రోజుల తరువాత తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని చెప్పారు. ఈ ఘటనపై అమీనుద్దీన్ కుటుంబ సభ్యులు ఎస్పీ అఖిల్ మహాజన్ ను కలిసి ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.