
- అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినం
- మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి
- కూర్చున్న కొమ్మనే నరుక్కున్నం: ఎంపీ వద్దిరాజు
హైదరాబాద్: బీఆర్ఎస్లీడర్ల మధ్య విభేదాలు ఎక్కువ అయ్యాయని.. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఓడిపోయామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ఖమ్మం పార్లమెంట్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘ఇక నుంచి నేతల మధ్య వర్గ విభేదాలు పక్కన పెట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. లేకపోతే పార్టీకి మరింత నష్టం వాటిల్లుతుంది’ అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.
కూర్చున్న కొమ్మనే నరుక్కున్నం: ఎంపీ వద్దిరాజు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ‘ఒక్క ఎమ్మెల్యే ఓడిపోతే ఏమవుతుందిలే అనుకుని చెట్టు కొమ్మలను ఒక్కొక్కటిగా మనమే నరుకున్నం. ఇప్పుడు చెట్టు కూలిపోయే పరిస్థితి తెచ్చుకున్నం. కొత్తగూడెంలో జనం నాడి తెలుసుకోలేకపోయాం. ఖమ్మం లోక్ సభ సీటు తిరిగి నామా నాగేశ్వరావుకే ఇవ్వాలి’ అని వద్దిరాజు విజ్ఞప్తి చేశారు.