
సికింద్రాబాద్, వెలుగు: త్యాగాల తెలంగాణను సీఎం కేసీఆర్ తాగుబోతుల అడ్డాగా మార్చిండని వైఎస్ఆర్టీపీ మాజీ నాయకురాలు ఇందిరా శోభన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బెల్టు షాపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా శనివారం మద్యం నియంత్రణ, బెల్ట్ షాపులను రద్దు చేయాలని సికింద్రాబాద్ఎంజీ రోడ్ లోని గాంధీ విగ్రహం వద్ద ఆమె మౌనదీక్ష చేపట్టారు. సీఎంకు జ్ఞానాన్ని ప్రసాదించాలంటూ గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ర్టంలో మద్యం తాగుడు అధికం కావడంతో అనేక కుటుంబాలు రోడ్డున పడుతుండగా, బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రాన్ని నడపడం సిగ్గుచేటని ఆమె విమర్శించారు.