
హైదరాబాద్, వెలుగు: రెండేండ్లుగా స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామ పంచాయతీలు నాశనం అయ్యే పరిస్థితి నెలకొందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు లేఖ రాశారు. రాజ్యాంగంలోని అధికరణం–243-కే ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్కు, గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు విస్తృతమైన అధికారాలు ఇచ్చారన్నారు.
ఓటరు లిస్టు తయారీ, ఎన్నికల నిర్వహణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి కట్టబెట్టారన్నారు. ఆ సంస్థ రాజ్యాంగం కల్పించిన అధికారాలను వినియోగించుకోకుండా ప్రభుత్వంలో ఒక శాఖగా పనిచేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులు చెప్పినట్లు ఇప్పుడున్న రిజర్వేషన్ల ఆధారంగా తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.