
- రూ.3.65 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మెదక్, వెలుగు: మెదక్ పట్టణాన్ని సమగ్ర అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. మెదక్ మున్సిపాలిటీ పరిధిలో రూ.3.65 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మెదక్ చర్చి ప్రాంగణంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.30 కోట్లు మంజూరు చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. సుభాష్ నగర్ కాలనీలో రూ.1.40 కోట్లతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు శంకుస్థాపన చేశామని, రూ.2.13 కోట్ల వ్యయంతో మెయిన్ గేట్ నుంచి చర్చి వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టం, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు వివరించారు.
రూ.8 లక్షల వ్యయంతో వెంకట్రావు నగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం నిర్మాణానికి శంకుస్థాపన చేశామని తెలిపారు. ఇది వరకు కాలనీలలో సీసీ రోడ్డు, డ్రైనేజీలు లేక ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలతో అభివృద్ధి దిశగా ముందుకు పోతున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్, మాజీ కౌన్సిలర్స్,ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.