పండగ పూట విషాదం: కార్లు ఢీకొని నలుగురు మృతి

పండగ పూట విషాదం: కార్లు ఢీకొని నలుగురు మృతి

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రావులపాలెం మండలం రావులపాడు వద్ద రహదారిపై రెండు కార్లు ఢీకొని నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని రోడ్డు అవతలివైపు వెళ్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

చనిపోయిన వారంతా విజయవాడకు చెందిన వారని తెలుస్తోంది. వీరంతా పండుక్కు పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం వచ్చినట్లు సమాచారం. సినిమా చూడటానికి రావులపాలెం వచ్చి తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది.

సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారకులైన వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే వారు కారు దిగి పరారీ అయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు నంబర్‌ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.

Four killed in road accident in East Godavari district