- విద్యార్థులను, టీచర్లను అభినందించిన కలెక్టర్ రాహుల్రాజ్
మెదక్టౌన్, వెలుగు: జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు మెదక్ జిల్లా నుంచి నాలుగు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. జనవరి 7 నుంచి 9 వరకు మూడు రోజుల పాటు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానికేతన్ స్కూల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా విద్యార్థులు ప్రతిభను చాటారు. సీనియర్ విభాగంలో పాల్గొన్న నాలుగు ప్రాజెక్టులు జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపియ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయస్థాయికి 21 ప్రాజెక్టులు ఎంపికవగా వాటిలో అత్యధికంగా మెదక్ జిల్లా నుంచి నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి.
ఎంపికైన విద్యార్థులను, గైడ్ టీచర్లను కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ నగేశ్ అభినందించారు. డీఎస్వో రాజిరెడ్డి, ఏఎస్వో నవీన్, విద్యార్థులు, గైడ్టీచర్లు పాల్గొన్నారు. అనంతరం పదో తరగతి పరీక్షలు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్అధికారులకు సూచించారు. మార్చి 2 నుంచి కలెక్టరేట్లో యధావిధిగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ నెల 23న హెల్ప్డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఆర్డీవో, తహసీల్దార్ ఆఫీసుల్లో యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు.
విద్యార్థుల ప్రగతిపై నిరంతర పర్యవేక్షణ
చిన్నశంకరంపేట: విద్యార్థుల ప్రగతిపై నిరంతర పర్యవేక్షణతో పాటు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మండలంలోని సూరారం జడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థుల గణిత సమస్యలను పరిష్కరించారు. అందరూ ప్రత్యేక తరగతులకు హాజరు కావాలని వందశాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. ఆయన వెంట హెచ్ఎం సాయిరెడ్డి ఉన్నారు.
