
- రాబోయే రోజుల్లోనూ ఇదే జోరు !
న్యూఢిల్లీ: మన ఈక్విటీ మార్కెట్లలో కొనుగోళ్ల ఆసక్తి పెంచుకున్న ఫారిన్ ఇన్వెస్టర్లు మే నెలలో ఇప్పటిదాకా రూ. 23,152 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరోసారి పెంచే ఛాన్స్ లేదని తెలవడంతోపాటు, దేశీయంగా మార్కెట్లో అనుకూలమైన పరిస్థితులు ఉండటం వల్లే కొనుగోళ్లకు ఎఫ్పీఐలు ఇష్టపడుతున్నారు. 2023 లో ఎఫ్పీఐలు రూ. 8,572 కోట్ల కొనుగోళ్లతో నెట్ బయ్యర్లుగా నిలుస్తున్నారు. రాబోయే రోజుల్లోనూ ఎఫ్పీఐల కొనుగోళ్ల దూకుడు ఇలాగే కొనసాగుతుందనే అంచనాలు ఉన్నాయని శాంక్టమ్ వెల్త్ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ కో–హెడ్ మనీష్ జెలోకా చెప్పారు.
రూపాయి బలపడటంతోపాటు, మరోవైపు డాలర్ వీక్ అవుతుండటంతో ఎఫ్పీఐలు సమీప భవిష్యత్లో మన మార్కెట్లో కొనుగోళ్లనే చేస్తారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్స్ట్రేటజిస్ వీ కే విజయ్కుమార్ పేర్కొన్నారు. డిపాజిటరీల డేటా ప్రకారం మే 2–మే 12 మధ్య కాలంలో ఎఫ్పీఐలు ఏకంగా రూ. 23,152 కోట్లను మన ఈక్విటీ మార్కెట్లో వెచ్చించాయి. ఇంతకు ముందు ఏప్రిల్నెలలో రూ. 11,630 కోట్లు, మార్చి నెలలో రూ. 7,936 కోట్లను ఎఫ్పీఐలు పెట్టాయి.
ఫైనాన్షియల్ ఇయర్ మొదటి రెండు నెలల్లో చూస్తే నికరంగా రూ. 34,000 కోట్ల పెట్టుబడులను ఎఫ్పీఐలు వెనక్కి తీసుకున్నాయి. యూఎస్ రీజినల్ బ్యాంకులు రిస్క్లో పడటంతో మార్చి నెలలో కొంత అనిశ్చితి నెలకొందని, గ్లోబల్గా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంతో నమ్మకం పెరిగి ఏప్రిల్, మే నెలల్లో ఎఫ్పీఐల పెట్టుబడులు అధికమయ్యాయని మనీష్ జెలోకా చెప్పారు. మే నెలలో డెట్ మార్కెట్లోనూ రూ. 68 కోట్లను ఎఫ్పీఐలు పెట్టుబడిగా పెట్టారు. ఫైనాన్షియల్ సెక్టార్లో జోరు కొనసాగిస్తూనే, క్యాపిటల్ గూడ్స్, ఆటో సెక్టార్లలోనూ ఎఫ్పీఐలు పెట్టుబడులు పెడుతున్నారు.