పెరుగుతున్న జాబ్​​ స్కామ్స్​.. మోసగాళ్లున్నారు జాగ్రత్త

పెరుగుతున్న జాబ్​​ స్కామ్స్​..   మోసగాళ్లున్నారు జాగ్రత్త

బెంగళూరు: చాలా కంపెనీలు లేఆఫ్స్​ ప్రకటిస్తుండగా, మోసగాళ్లు మాత్రం జాబ్స్​ ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నిండాముంచుతున్నారు. సింగపూర్​లో జాబ్స్​ఉన్నాయంటూ ఈ ఏడాది మార్చిలో కొందరు మోసగాళ్లు ప్రకటనలు ఇచ్చారు. కంపెనీ లోగోతో నకిలీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ను సృష్టించి,  కొచ్చిలో ఆఫీసును కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు రెండు రౌండ్ల ఇంటర్వ్యూలు కూడా నిర్వహించి, నకిలీ  లెటర్‌‌‌‌ హెడ్‌‌‌‌లపై ఆఫర్‌‌‌‌ లెటర్లు ఇచ్చేశారు. దాదాపు 30 మందిని ఎంపిక చేశారు. ఏజెన్సీ ఫీజులు, వీసా ఖర్చులు, కల్చరల్​ కార్యక్రమానికి రూ. లక్ష నుంచి రూ.3 లక్షల వరకు చెల్లించాలని అడిగారు. డబ్బులు వసూలు చేసి పత్తా లేకుండా పోయారు. బాధితులు రియల్ రిక్రూట్‌‌‌‌మెంట్ సంస్థకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌లను సంప్రదించగా, ఆ ఏజెన్సీతో ఎలాంటి సంబంధమూ లేదని తెలిసింది.  ఇలాంటివి చాలా నగరాల్లో జరుగుతున్నాయి.

జాబ్ స్కామ్‌‌‌‌లు చేసే- మోసగాళ్లు తమపై నమ్మకం కలగడానికి ప్రముఖ రిక్రూట్‌‌‌‌మెంట్ సంస్థల ప్రతినిధులుగా అవతారం ఎత్తుతున్నారు. ఇలాంటి మోసగాళ్లు పెరుగుతూనే ఉన్నారని మ్యాన్‌‌‌‌పవర్‌‌‌‌గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ అలోక్ కుమార్ చెప్పారు. ఇటువంటి ఘటనలు ఆరు నెలల క్రితంతో పోలిస్తే దాదాపు రెట్టింపు అయ్యాయని అన్నారు. నియామకాలు మందగించడం, తొలగింపుల కారణంగా జాబ్ స్కామ్‌‌‌‌లు పెరుగుతున్నాయి. మ్యాన్​పవర్​, ర్యాండ్‌‌‌‌స్టాడ్​, ఫౌండింట్​ వంటి రిక్రూట్​మెంట్​ ఏజెన్సీలు  తమ పేర్లతో మోసాలు జరగకుండా నిరోధించడానికి అప్రమత్తంగా ఉంటున్నాయి. లేఆఫ్​ల కారణంగా ఉపాధికి దూరమైన వాళ్లు ఇలాంటి మోసాల బారిన పడుతున్నారని కుమార్ చెప్పారు. మోసాలపై అవగాహన కలిగించడానికి తాము సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామని చెప్పారు. తమలాంటి ఏజెన్సీలు జాబ్స్​ కోసం డబ్బు డిమాండ్​ చేయబోవని స్పష్టం చేశారు. ఇలాంటి స్కామ్​లు గతంలో ఎన్నడూ లేనంతంగా పెరిగాయని రాండ్‌‌‌‌స్టాడ్ ఇండియా డైరెక్టర్ సంజయ్ చెప్పారు.

ఫ్రెషర్లు, జూనియర్లే టార్గెట్​...

మోసగాళ్లు నిరుద్యోగులను మోసం చేయడానికి ఎంతదూరమైనా వెళ్తున్నారు. నిజమైనవిగా అనిపించే జాబ్ సైట్‌‌‌‌లను ఏర్పాటు చేసి, కంపెనీ లోగోలు/లెటర్‌‌‌‌హెడ్‌‌‌‌లను సృష్టిస్తున్నారు. ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నారు.  తాము నిజమైన రిక్రూటర్లమంటూ పలు ప్లాట్​ఫారాలలో రిజిస్ట్రేషన్​ చేసుకొని నిరుద్యోగుల రెజ్యూమ్‌‌‌‌లు తీసుకుంటున్నారు. క్యాండిడేట్ల నుంచి వ్యక్తిగత, ఆర్థిక వివరాలను తీసుకోవడమేగాక ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. వీళ్లు ఎక్కువగా జూనియర్లు, ఫ్రెషర్లు,  ఉద్యోగం పోగొట్టుకున్నవాళ్లు లేదా విదేశాలకు వెళ్లడానికి ఆసక్తి ఉన్నవారిని టార్గెట్​ చేస్తున్నారు. డబ్బులు తీసుకున్నాక సీఈఓలు/చైర్​పర్సన్ల పేరుతో నకిలీ జాబ్ ఆఫర్​ లెటర్లు ఇస్తున్నారు. ‘‘ఇలాంటి మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలో వివరిస్తూ సుమారు మూడు నెలల క్రితం మా వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో కొంతసమాచారం ఇచ్చాం.  ఈ–మెయిల్ ఐడీలు, డొమైన్ పేర్లలో చిన్న తేడాలతో ఎలా మోసం చేస్తారో అవగాహన కల్పించాం. నకిలీ,  నిజమైన ఆఫర్‌‌‌‌ల మధ్య తేడాను ఎలా గుర్తించాలో తెలియజేశాం. ఇంటర్వ్యూ లేని ఆఫర్ లెటర్​ను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మకూడదు’’ అని శెట్టి చెప్పారు. 

హెచ్‌‌‌‌ఆర్ సొల్యూషన్స్ కంపెనీ అడెకో ఇండియా తన పేరిట అనేక నకిలీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌‌‌‌ను ఉన్నట్టు గుర్తించింది. ఈ హ్యాండిల్స్​కు వేలాది మంది ఫాలోయర్లు ఉండటం విచిత్రం.  జాబ్ పోర్టల్ ఫౌండిట్  చీఫ్ ఎగ్జిక్యూటివ్ శేఖర్ గరిసా మాట్లాడుతూ, తక్కువ ఉద్యోగాలు ఉన్నప్పుడు, నిరాశకు గురైన వ్యక్తులను మోసగాళ్లు వేటాడుతుంటారని కామెంట్ చేశారు. రాండ్‌‌‌‌స్టాడ్  శెట్టి ఈ వాదనతో అంగీకరించారు.  మోసగాళ్లు తెలివిగా మారుతున్నారని,  కంపెనీలు వీళ్ల కంటే రెండు అడుగులు ముందే ఉండాలని అభిప్రాయపడ్డారు. వీలైనన్ని మార్గాల ద్వారా జనానికి అవగాహన కల్పిస్తూ ఉండాలని చెప్పారు.