- ఈ నెల 25 నుంచి ఉప్పల్లో టెస్టు మ్యాచ్
హైదరాబాద్, వెలుగు: ఇండియా–ఇంగ్లండ్ జట్ల మధ్య ఈనెల 25 నుంచి 29 వరకు ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరిగే టెస్టు మ్యాచ్ను చూసేందుకు స్కూల్ స్టూడెంట్లను ఉచితంగా అనుమతిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్స్కు చెందిన 6 నుంచి12వ తరగతి స్టూడెంట్లకు ఉచిత కాంప్లిమెంటరీ పాసులుతో ఉచిత భోజనం కూడా అందిస్తామని బుధవారం తెలిపింది.
ఈ అవకాశం సద్వినియోగం చేసుకునేందుకు సంబంధిన స్కూల్ ప్రిన్సిపాల్ ఏ రోజు ఎంత మంది స్టూడెంట్లు, స్టాఫ్ వస్తున్నారనే వివరాలను ఈ నెల 18వ తేదీలోపు హెచ్సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ceo.hydca@gmail.com) ఈ మెయిల్ రూపంలో లేదా ఉప్పల్ స్టేడియంలో వ్యక్తిగతంగా హాజరై అందిచాలని సూచించింది. ఉచిత పాస్లతో మ్యాచ్లకు వచ్చే స్టూడెంట్లు తప్పనిసరిగా తమ స్కూల్ యూనిఫాం వేసుకోవాలని స్పష్టం చేసింది.
బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఫిదా
ఇండియా–ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్కు రెడీ అవుతున్న ఉప్పల్ స్టేడియాన్ని బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ( తెలంగాణ, ఏపీ) గారెత్ విన్ ఒవెన్ మంగళవారం పరిశీలించారు. బీసీసీఐ నిధులతో ఇటీవల కొత్తగా తీర్చిదిద్దిన స్టేడియాన్ని చూసి ఫిదా అయ్యారు. టెస్టు మ్యాచ్కు రెండు వారాల ముంగిట స్టేడియం అద్భుతంగా కనిపిస్తోందన్నారు. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, సెక్రటరీ దేవ్ రాజ్, సీఈవో సునీల్ కాంటేతో సమావేశమైన ఆయన ఇంగ్లండ్ నుంచి వచ్చే ఫ్యాన్స్కు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు మంచి ఏర్పాట్లు చేస్తున్నారని కొనియాడారు.