
- మహిళా శక్తే కాంగ్రెస్ బలం
- చైనా, పాక్తో యుద్ధంలో ఇందిరాగాంధీ ప్రపంచానికి మహిళాశక్తిని చాటారు
- ఆడబిడ్డలను వ్యాపార రంగంలో ప్రోత్సహిస్తున్నం
- మహాలక్ష్మీ స్కీమ్తో ఆర్టీసీకి లాభాలు
- మహిళలను కోటీశ్వరులు చేస్తమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మహిళా సంఘాల సభ్యులకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహిళా సంఘాల్లోని సభ్యులందరికీ యూనిక్ నంబర్ లేదా క్యూఆర్ కోడ్ కలిగిన గుర్తింపు కార్డు జారీ చేసే విధానం అమల్లోకి తేవాలని అధికారులను ఆయన ఆదేశించారు. అందులో ఆరోగ్య, ఆర్థికపరమైన వివరాలతో డేటాబేస్ నిర్వహించాలని చెప్పారు.
ఇందుకోసం ప్రతిఏటా మహిళలకు ఫ్రీగా హెల్త్ టెస్టులు చేయాలని సూచించారు. ఇది వైద్య సేవలను మెరుగుపరచడంతో పాటు ఆరోగ్య సమస్యలను నియంత్రించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. శనివారం హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో వీహబ్ ఆధ్వర్యంలో జరిగిన విమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. మహిళా సంఘాలతో కలిసి పని చేయడానికి వివిధ సంస్థలకు మధ్య కుదిరిన అవగాహనా ఒప్పంద పత్రాలను సీఎం సమక్షంలో మార్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యంపై మహిళలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
‘‘స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇస్తున్న గుర్తింపు కార్డు స్థానంలో ఒక యూనిక్ ఐడీ కార్డు జారీ చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి. మహిళలకు అవసరమైన హెల్త్ చెకప్లు చేయించడంతో పాటు హెల్త్ ప్రొఫైల్స్ తయారు చేయించాలి. ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత సహాయం అందించడం కాదు.. వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆరోగ్య పరమైన సమస్యలు రాకుండా సహాయం అందించాలి” అని పేర్కొన్నారు.
మహిళాశక్తిని చాటిన ఇందిరా..
మహిళా శక్తి ద్వారానే రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ మహిళా శక్తిని ఎల్లవేళలా ప్రోత్సహిస్తుంది. 1967లో -చైనాతో యుద్ధంలో, 1971లో పాకిస్తాన్తో యుద్ధంలో మహిళా శక్తిని ఇందిరాగాంధీ ప్రపంచానికి చాటిచెప్పారు. సోనియాగాంధీ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వంటి చట్టాలను తీసుకొచ్చి మహిళల శక్తిని నిరూపించారు” అని తెలిపారు.
‘‘మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. దీనివల్ల ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తున్నది. గత 16-–17 నెలల్లో రూ.5,200 కోట్లు ఆర్టీసీకి చెల్లించాం. గతంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ.. ఇప్పుడు లాభాల్లోకి రావడంతో 50 వేల మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు లబ్ధి జరుగుతున్నది. ఈ పథకం వల్ల మహిళలకు నెలకు సగటున రూ.5 వేలు ఆదా అవుతున్నది” అని చెప్పారు.
సభ్యుల సంఖ్య కోటి చేస్తం
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మహిళా సంఘాల్లో 67 లక్షల మంది సభ్యులు ఉన్నారని, ఆ సంఖ్యను కోటికి పెంచాలని అధికారులకు సూచించారు. పట్టణ ప్రాంతాల్లోని మహిళలను సంఘాల్లో చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. ‘‘మహిళలు ఐకమత్యంతో ఉంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వాన్నైనా గెలిపించగలరు.. గద్దె దించగలరు. కోటి మంది మహిళల ఓట్లతో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మహిళల సాధికారతకు కృషి చేస్తం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మరిన్ని వ్యాపారాలు అప్పగిస్తం..
మహిళలను వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘నారాయణపేటలో మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశాం. వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు కూడా వాళ్లకు అప్పగిస్తున్నాం. హైదరాబాద్లోని హైటెక్ సిటీలో 3.5 ఎకరాల స్థలాన్ని మహిళా సంఘాలకు కేటాయించి, 106 స్టాల్స్ ఏర్పాటు చేశాం.
ప్రభుత్వ పాఠశాలల్లో స్టూడెంట్ల యూనిఫామ్ కుట్టే బాధ్యతలతో పాటు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ కూడా మహిళా సంఘాలకు అప్పగించాం. ఆర్టీసీలో 600 బస్సులను మహిళా సంఘాలకు అందజేస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తాం” అని హామీ ఇచ్చారు. ‘‘స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రూ.21 వేల కోట్లు అందించాం.
మహిళలు ఆర్థిక క్రమశిక్షణతో రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు. పోయినేడాది రూ.20 వేల కోట్లు అందిస్తే, ఒక్క రూపాయి ఎగవేయకుండా చెల్లించారు. బ్యాంకులకు వారిపై విశ్వాసం పెరుగుతున్నది.” అని వెల్లడించారు.