
పంజాగుట్ట, వెలుగు: నిజాం ఇనిస్టిట్ట్యూట్ఆఫ్మెడికల్ సైన్సెస్(నిమ్స్) ఆసుపత్రిలో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి డైరెక్టర్ ఎన్.బీరప్ప శనివారం తెలిపారు. చార్లీస్ హార్ట్ హీరోస్ పేరుతో నిర్వహిస్తున్న ఆపరేషన్లు కోసం 24వ తేదీ ఆదివారం నుంచి 30 వ తేదీ వరకు మిలీనియం బ్లాకులో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
శిశువుల నుంచి ఐదేండ్లలోపు పిల్లలకు గుండెలో రంధ్రం, గుండె సంబంధ వ్యాధులకు చికిత్స అందిస్తారు. బ్రిటన్ వైద్యుడు రమణ దున్నపునేని ఆధ్వర్యంలో పదిమంది వైద్య బృందంతోపాటు నిమ్స్ కార్డియాథోరాసిక్ విభాగాధిపతి అమరేశ్వరరావు, నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు పాల్గొంటున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకు 040–23489025 నంబరు ద్వారా ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు సంప్రదించవచ్చు.