
ములుగు, వెలుగు: ములుగు మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన ఐకేపీ కంప్యూటర్ఆపరేటర్హత్య కేసును పోలీసులు చేధించారు. శనివారం సీఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ విజయకుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ములుగు గ్రామానికి చెందిన తీగుళ్ల నెహ్రూ (35), వర్గల్ మండలం మజీద్ పల్లి గ్రామానికి చెందిన గమిలిపురం మహేశ్ ఇద్దరూ స్నేహితులు. వీరి మధ్య తరచుగా చిట్ఫండ్డబ్బుల లావాదేవీలు జరిగేవి.
ఈ క్రమంలో మహేశ్కు కొండపాక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో పీఈటీగా పనిచేస్తున్న నిషారాణితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల చిట్ఫండ్ కమిషన్డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య విబేధాలు ఏర్పడడంతో మహేశ్ఈ నెల 28న నిషారాణి వద్ద ఉన్న బంగారాన్ని మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ వర్గల్ బ్రాంచ్ వద్ద తాకట్టు పెట్టి రూ.58,600 రుణం తీసుకున్నాడు. ఆ డబ్బును అప్పులు కట్టడానికి వినియోగించుకున్నట్టు చెప్పినా ఆమె నమ్మలేదు. నెహ్రును మధ్య వర్తిగా తీసుకురమ్మని చెప్పింది. ఈ క్రమంలో మహేశ్ అతడిని తీసుకొని నిషారాణి ఇంటికి వెళ్లగా అక్కడ నెహ్రూ ఆమె గురించి అసభ్యకరంగా మాట్లాడడంతో మహేశ్కోపంతో అతడిపై దాడి చేశాడు.
Also Read : భర్త హత్యకు భార్య స్కెచ్ ..సజీవంగా పాతిపెట్టాలని చూస్తుండగా..షాకింగ్ ట్విస్ట్
ఇంట్లో ఉన్న వైర్ను మెడకు చుట్టి చంపేశాడు. తర్వాత నిషారాణి తండ్రి కొమురయ్య సాయంతో డెడ్బాడీని కారులో మద్దూరు మండలం గాగిళ్లపూర్లో ఉన్న పొలానికి తీసుకెళ్లి దాచిపెట్టారు. తర్వాత బాడీకి రాళ్లను కట్టి పెద్ద చెరువులో పడేశారు. అనంతరం ఉబ్బని వినయ్ ఫోన్ నుంచి నెహ్రూ భార్యకు ఫేక్ కాల్ చేసి అన్న రేపు వస్తాడని చెప్పాడు. మరునాడు మహేశ్ వెళ్లి అతడి భార్యకు రూ.15000 చిట్టి డబ్బులను ఇచ్చి నెహ్రూ బాగానే ఉన్నట్లు నమ్మించడానికి ప్రయత్నించారు. మహేశ్ఫోన్ను కొండపోచమ్మ కెనాల్లో పడేసి ట్రేస్కాకుండా జాగ్రత్త పడ్డారు. ప్రధాన నిందితుడైన గమిలిపురం మహేశ్, సహా నిందితులు నిషా రాణి, ఉబ్బని వినయ్, నారదాసు కొమురయ్యను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.