ఓ అపార్ట్ మెంట్కు డబుల్ షాక్ ఇచ్చిన వాటర్ బోర్డు
పద్మారావునగర్, వెలుగు: ఫ్రీ వాటర్ స్కీమ్ వర్తించినా ఓ అపార్ట్మెంట్కు రూ. 2 లక్షలకుపైగా బిల్లు వేసి వాటర్ బోర్డు షాక్కు గురిచేసింది. బన్సీలాల్పేట డివిజన్ న్యూ బోయిగూడలోని ఎంఎన్కే విట్టల్సెంట్రల్ కోర్టు అపార్ట్మెంట్లో 77 ఫ్లాట్లు ఉండగా.. ఫ్రీ వాటర్ స్కీమ్ కింద 2021, ఆగస్ట్లో తమ పేర్లను నమోదు చేసుకుని బల్దియా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను అందించారు. స్కీమ్ కింద 77 ఫ్లాట్ల ఓనర్లకు సెప్టెంబర్2022 వరకు వాటర్ బోర్డు బిల్లులు జారీ చేయలేదు. కాగా.. మీటర్ రీడింగ్ తీయకుండానే.. గత మే 5న 1 లక్ష 74వేల182 రూపాయల బిల్లును ఇచ్చింది. దీంతో షాక్కు గురైన అపార్ట్మెంట్ వాసులు బిల్లును మళ్లీ పరిశీలించాల్సిందిగా కోరుతూ వాటర్ బోర్డుకు వినతిపత్రం అందించారు.
అపార్ట్మెంట్ నల్లా మీటర్ పనిచేయడం లేదని, వారం రోజుల్లోగా మార్చుకోవాలని గత జూన్ 9న అధికారులు తిరిగి నోటీసు జారీ చేశారు. అదే నెల13న కొత్త మీటర్అమర్చుకోగా 19న ఏకంగా రూ. 2లక్షల 17వేల 948 రూపాయల బిల్లు జారీ చేసి రెండోషాక్ఇచ్చింది. వాటర్ బోర్డుతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న నల్లా మీటర్లు సప్లై చేసే సావెర్లీ ఏజెన్సీ మీటర్ను మార్చేందుకు రూ. 25వేలు తీసుకుందని అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ హనుమాండ్లు వాపోయారు. మీటర్లు సప్లై చేసే ఏజన్సీలతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. దీనిపై విచారణ జరిపి బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

