హైదరాబాద్, వెలుగు : ఫ్రాన్స్కు చెందిన బేవరేజెస్ తయారీ కంపెనీ, జార్జెస్ మోనిన్ భారతదేశంలో తన మొదటి ప్లాంటును హైదరాబాద్ శివార్లలో సంగారెడ్డి జిల్లా గుంటపల్లి గ్రామంలో నిర్మించనుంది. ఇది 40 ఎకరాల స్థలంలో ఏర్పాటవుతుంది. ప్లాంట్లు కోసం రూ.300 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు తెలిపింది. ఇందులో మోనిన్ ఇండియా హెడాఫీస్, ఆర్అండ్డీ కేంద్రం, మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఉంటాయి. వంద మందికి ఉపాధి దొరుకుతుంది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ డెవెలప్మెంట్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్, ఈశాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, బెంగళూరులోని ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ థియరీ బెర్థెలాట్, జార్జెస్ మోనిన్ ఛైర్మన్ ఒలివర్ మోనిన్ తదితరులు పాల్గొన్నారు. భూమిపూజ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ‘‘తెలంగాణలో మోనిన్ తన కార్యకలాపాలను ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్ధవంతమైన నాయకత్వం కారణంగా తెలంగాణలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి.
రాష్ట్రంలో పెట్టుబడిదారుల లిస్టులో మోనిన్ చేరడంతో, రాష్ట్ర ఆహార ప్రాసెసింగ్ ఎకోసిస్టమ్ మరింత వృద్ధి చెందుతుంది. తెలంగాణను తమ హబ్గా మార్చు కోవాల్సిందిగా మోనిన్ని కోరుతున్నాను. ఇప్పుడు రూ. 300 కోట్ల పెట్టుబడి పెట్టడమే కాకుండా మరింత విస్తరిస్తారని ఆశిస్తున్నాను" అని అన్నారు. మోనిన్ టీమ్కు స్థానిక శాసనసభ్యులతో పాటుగా ఆఫీసర్లు అన్ని విధాలా సహకరిస్తారని భరోసా ఇచ్చారు.
స్థానిక యువతకు ఉపాధి కల్పించాల్సిందిగా ఆయన కంపెనీని కోరారు. ఒలివర్ మోనిన్ మాట్లాడుతూ చాలా కంపెనీలకు భారతదేశం గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యమైన మార్కెట్గా మారిందని, అందుకే ఇక్కడ తమ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తమ విస్తరణ ప్రణాళికలకు ఈ కేంద్రం తోడ్పడుతుందని చెప్పారు.