న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ బుధవారం ఎసెన్షియల్ కమొడిటీస్ యాక్ట్ (ఈసీఏ), 1955 అమెండ్ మెంట్స్ కు ఆమోదం తెలిపింది. అన్నదాతలకు ఇక ‘అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ)’ అడ్డంకులు తొలగిపోయాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. రైతన్నలకు మార్కెట్ అడ్డంకులను తొలగించేందుకు ‘వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యం (ప్రోత్సాహం, ఫెసిలిటేషన్) ఆర్డినెన్స్, 2020’కి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కోల్ కతా పోర్ట్ ట్రస్ట్ పేరును శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ గా పేరు మార్చేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈసీఏ అమెండ్ మెంట్స్ వల్ల లాభాలివే..
- పప్పులు, ధాన్యాలు, నూనెగింజలు, ఎడిబుల్ ఆయిల్స్, ఉల్లి, ఆలుగడ్డలను ఎసెన్సియల్ కమొడిటీస్ లిస్టు నుంచి తొలగించేందుకు వీలవుతుంది.
- వ్యవసాయ రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్లకు అవకాశం ఏర్పడుతుంది.
- ధరలు స్థిరంగా కొనసాగుతాయి.
- పంట ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లలో అడ్డంకులు తొలగిపోతాయి.
- ట్రేడ్ ఆర్డినెన్స్ తో ఇవీ లాభాలు..
- రాష్ట్రంలో ఏపీఎంసీ పరిధి ఆవల కూడా పంటను అమ్ముకోవచ్చు. అలాగే ఇతర రాష్ట్రాల్లోనూ ఎక్కడైనా రైతులు పంటను అమ్ముకునేందుకు వీలవుతుంది.
- రైతులకు మార్కెటింగ్ ఖర్చులను తగ్గించడంతో పాటు మంచి ధరలు లభిస్తాయి.
- ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలక్ట్రానిక్ ట్రేడ్ జరిగేందుకు ఈ ఆర్డినెన్స్ ఒక ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ట్రాన్షాక్షన్ ప్లాట్ ఫామ్ ను కూడా ప్రతిపాదించింది.
- వన్ ఇండియా, వన్ అగ్రికల్చర్ మార్కెట్: ఏపీఎంసీ మార్కెట్ యార్డులకు బయట రైతులకు ట్రేడింగ్ అవకాశాలు కల్పించడం ద్వారా కాంపిటీషన్ పెంచి, రైతులకు మంచి ప్రోత్సాహక ధరలు లభించేలా చూడటమే ఈ ఆర్డినెన్స్ లక్ష్యం. ఇది వన్ ఇండియా, వన్ అగ్రికల్చర్ మార్కెట్ కాన్సెప్టుకు మార్గం సుగమం చేస్తుంది.